మొన్నటి వరకు రాజేసిన ‘కాపు’ కుల రాజకీయం వర్కౌట్ కాకపోవడంతో, తాజాగా ‘మత’ రాజకీయానికి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తెరలేపారన్న రాజకీయ విమర్శలు జోరందుకుంటున్నాయి. తాజాగా శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జగన్ తీరుపై అనేక ప్రశ్నలు వెలువడుతున్నాయి. అసలు ఈ కార్యక్రమమే రాజకీయ కోణంలో చేసిందన్న కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి.
గతేడాది గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానం ఆచరించిన జగన్ మెడలో శిలువ దర్శనమివ్వడం అప్పట్లో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో తాజాగా జరిగిన పూజల్లో తెల్లని అంగ వస్త్రం ధరించి, మెడలోని శిలువ కనపడకుండా జాగ్రత్త పడ్డారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పలు ఫోటోలు కూడా సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. అయితే ఉన్నట్లుండి జగన్ నిర్వహించిన ఈ పూజలే రాజకీయ కోణంలో నిండి ఉన్నాయన్న విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మోడీ సర్కార్ నుండి బయటకు వస్తుందా… ఎప్పుడు ఎన్డీఏలో చేరదామా? అని వేచిచూస్తున్న జగన్, బిజెపికి ముద్రపడ్డ హిందువులను ఆకర్షించేందుకే ఈ అకస్మాత్తు పూజలు అన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఓ పక్కన ఏపీలో చంద్రబాబు కృష్ణా పుష్కరాలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తుండడంతో, తానూ కూడా హిందువుల వైపు ఉన్నానని చెప్పడానికి మాత్రమే జగన్ చేసిన ఈ హడావుడిగా రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి.
ప్రత్యేక హోదా కోసమని చెప్తూ చేసిన ఈ పూజలతో రెండు రకాలుగా వర్కౌట్ చేసుకునేందుకు పన్నిన ఎత్తుగడ అని, గతంలో చాలా సార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ, ఎప్పుడూ కనీసం హిందూ దేవాలయాల వైపు కన్నెత్తి కూడా చూడని జగన్, హఠాత్తుగా ప్రేమ పుట్టుకురావడానికి కారణం… మోడీ సర్కార్ తీరుపై చంద్రబాబు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఇదే అదునుగా మోడీ సర్కార్ కు దగ్గరయ్యేందుకు జగన్ పడుతున్న తాపత్రయంగా అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనా అంతిమంగా జగన్ ఏ కార్యం చేసినా… దాని వెనుక రాజకీయ ప్రయోజనం తప్ప, మరొకటి ఆశించి ఉండదని మాత్రం స్పష్టంగా కనపడుతోందని టిడిపి వర్గాలు విమర్శిస్తున్నాయి.



