తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరుగుతున్న అనుమానాస్పద మరణాలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనపడడం లేదు. ఇటీవల కొడనాడులోని ఆమె ఎస్టేట్లోని వాచ్ మన్ దారుణ హత్యకు గురి కాగా, ఆ తర్వాత ఎస్టేట్ లో జరిగిన దోపిడీకి నేతృత్వం వహించిన జయ మాజీ డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ఇదిలా ఉంటే, మరో మాజీ డ్రైవర్ సయాన్ కూడా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రమాదంలో అతడి భార్య, పిల్లలు మృతి చెందారు. అలాగే పలువురు మంత్రులు, ఐపీఎస్ ల వద్ద కారు డ్రైవర్గా పనిచేసిన రవిచంద్రన్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాజాగా జయ నివాసంలో వంటమనిషిగా పనిచేసిన 80 ఏళ్ళ పంచవర్ణంపై శనివారం హత్యాయత్నం జరిగింది.
ఉదయం ఇంటి వద్ద ఉన్న ఆయనపై ఐదుగురు దుండగులు మారణాయుధాలతో దాడిచేసి పరారయ్యారు. తీవ్ర గాయాల పాలైన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. హత్యాయత్నం కేసును నమోదు చేసేందుకు సైదాపేట పోలీసులు నిరాకరించడంతో పంచవర్ణం కుమారుడు, అన్నాడీఎంకే ప్రభుత్వంలో సమాచార, పౌర సంబంధ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన మురుగేశన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు.



