తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి మరో 6 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చి చేరాయి. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వాస్తవానికి సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నప్పటికీ, స్వతంత్ర అభ్యర్థులంతా నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టీడీపీ అభ్యర్థులు ఎన్నికైనట్టు చెప్పవచ్చు.
అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి మేనల్లుడు అయిన దీపక్ రెడ్డి విషయంలో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే స్వతంత్ర అభ్యర్థి పైలా నర్సింహయ్య తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో దీపక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజు, పశ్చిమగోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్, తూర్పుగోదావరి జిల్లాలో చిక్కాల రామచంద్రరావు, చిత్తూరు జిల్లాలో దొరబాబులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.



