పార్లమెంటులో అమరావతి బిల్లుకి ఆమోదముద్ర పడుతున్న సమయంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్ పెట్టి మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన చేశారు.
దీనిని మీడియా, రాజకీయ విశ్లేషకులు, చివరికి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు రకరకాలుగా విశ్లేషించారు. వారిలో చాలా మంది ఇదొక పిచ్చి ఐడియా. జగన్ ఒక బఫూన్. జోకర్. సైకో… అంటూ రకరకాల అభిప్రాయలు చెప్పారు.
కానీ మాజీ ఐపీఎస్ అధికారిఏబీ వెంకటేశ్వరరావు మాత్రం జగన్ మనసులో తొంగి చూసినట్లు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“మావిగన్ అన్నందుకు అందరూ జగన్ని పిచ్చోడు అంటున్నారు. కానీ ఆయనేమీ అందరూ అనుకున్నట్లు పిచ్చోడు కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి ఆమోదం తెలిపింది కనుక ఇక ఎవరూ దానిని మార్చలేరని చాలా మంది అంటున్నారు. కానీ నేను వస్తే తప్పకుండా మారుస్తానని చెప్పడానికే జగన్ ప్రెస్మీట్ పెట్టారు.
అంతేకాదు… అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నవారికి జగన్ బలమైన సందేశం పంపించాలనుకున్నారు. మళ్ళీ నేను వస్తే మీ పెట్టుబడులు బుడమేరులో వరదలో కొట్టుకుపోతాయని పెట్టుబడిదారులను హెచ్చరించడమే జగన్ ప్రెస్మీట్ ముఖ్యోదేశ్యం.
మావిగన్తో పంపిన సందేశం చేరాల్సిన వాళ్లకు చేరిపోయింది. దానిని ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు కూడా మార్చలేరు,” అని ఏబీ వేంకటేశ్వర రావు అన్నారు.
ఏబీ వ్యాఖ్యలు కాస్త అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, జగన్ ఆడిన మూడుముక్కలాటతో పరిశ్రమలు, పెట్టుబడిదారులు పారిపోవడం గుర్తు చేసుకుంటే, ఏబీ వ్యాఖ్యలు నిజమే అని ఒప్పుకోక తప్పదు.
ఒకవేళ జగన్ మళ్ళీ సిఎం అయితే?ముందుగా అమరావతి పనులన్నీ ఎక్కడివక్కడ నిలిపేస్తారు. అక్కడ ఏర్పాటవుతున్న సంస్థలకు సహాయ నిరాకరణ చేస్తూ పారిపోయేలా చేస్తారు. విశాఖ నుంచి లూలూ గ్రూప్ని అలాగే తరిమేశారు కదా?
ఈసారి ‘మావిగన్’ అంటున్నారు కనుక వైసీపీ నేతలకు ఆ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసుకోవాలని జగన్ సూచిస్తున్నట్లే భావించవచ్చు.
ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ చెప్పిన రెండు ముక్కలు గుర్తుచేసుకోవాలి. “మనం అధికారంలో ఉండేది కేవలం 5 ఏళ్ళే. కనుక 5 ఏళ్ళకు సరిపడే ఆలోచనలు చేస్తే చాలు. 20-30 ఏళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు,” అని అన్నారు.
అందుకే జగన్కి రాజధాని ముఖ్యం కానే కాదు. విశాఖ అన్నా… ఇప్పుడు మావిగన్ అంటున్నా ఆ పేర్లు ఆయన రాజకీయ చదరంగం ఆడేందుకు ఉపయోగించేవి మాత్రమే.
ఈసారి ఆడబోయే ఈ రాజకీయ చదరంగంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టేవారు పావులు అవుతారని జగన్ హెచ్చరిస్తున్నారని ఏబీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు.




