‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు శివాజీ తాను వైసీపీలోకి వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు. వైసీపీ అధినేత జగన్ తో చర్చలు ముగిసాయని, ఇరువర్గాలు ఒక అంగీకారానికి వచ్చారని, ఈ మేరకు త్వరలోనే వైసీపీలోకి వెళ్తున్నారని హల్చల్ చేస్తున్న అంశాలను ఖండించిన శివాజీ, గతంలో పవన్ కళ్యాణ్ పై స్పందించినపుడు జనసేనలోకి వెళ్తున్నారని అన్నారని, ఇపుడేమో వైసీపీ అంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీదే ఉందని… త్వరలోనే కొత్త సినిమాను ప్రకటిస్తానని స్పష్టత ఇచ్చారు. పదవుల కోసం వెంపర్లాడే వ్యక్తిగా, పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిగా తనను ప్రజలు చీదరించుకోవాలని తాను కోరుకోవడం లేదని అన్న శివాజీ, ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయ వ్యవస్థ మొత్తం నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ… ‘ఏ పార్టీలో చేరినా ఏముంది గర్వకారణం’ అంటూ శ్రీశ్రీ గేయాన్ని కూడా అందుకున్నారు.
తనకు అన్ని పార్టీలు ఒకేలా ఉన్నాయని… ఏ పార్టీలో చేరాలని లేదని, ప్రజల కోసం మాత్రం తన గొంతుక వినిపిస్తూనే ఉంటానని చెప్పారు. ఇలాంటి రాజకీయ నేతల మధ్య నాయకుడిగా రావాలనుకునే యువత… మర్డర్లు, మానభంగాలు, ఛీటింగ్ లు ఇవన్నీ నేర్చుకుని వస్తే తప్ప… ఈ రంగంలో మనలేరని చెప్పారు. కులం, మతం, వర్గం మీద ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయని… 2009 నుంచి ప్రత్యక్షంగా ప్రజల్లో ఉన్నానని… ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మళ్లీ సినిమాలు చేయబోతున్నానని అన్నారు.



