తెలుగు అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్న అందాల బొమ్మ ప్రత్యూష అర్ధాంతరంగా విగతజీవిగా పడి ఉండడం అప్పట్లో అందరికీ షాక్ కు గురిచేసింది. దీనివెనుక బడా రాజకీయ నేతల పుత్రరత్నాల ‘హస్తాలు’ ఉన్నాయని వార్తలు హల్చల్ చేసినప్పటికీ, అసలు ప్రత్యూష ఎలా మరణించింది? అన్న విషయం కాలగర్భంలో కలిసిపోయింది. తమ కూతురి విషయంలో న్యాయం జరగలేదని ఇప్పటికీ ప్రత్యూష తల్లి మీడియాలో కనపడినప్పుడల్లా వాపోతూంటారు.
తెలుగు బ్యూటీ మాదిరే బాలీవుడ్ లోనూ అప్పుడప్పుడే ఎదుగుతున్న జియాఖాన్ కూడా అర్ధాంతరంగా కాలం చేయడం సినీ వర్గాలను కలచి వేసింది. ఇందులో కూడా అనేక ఆరోపణలు వ్యక్తం కావడంతో కేసు సీబీఐకు చేరింది. మొత్తం విచారణ జరిపిన తర్వాత జియా ఖాన్ ది ఆత్మహత్యే అని సీబీఐ నిర్ధారించింది. తాము సేకరించిన మౌఖిక, సైంటిఫిక్, ఫోరెన్సిక్, డాక్యుమెంటరీ ఆధారాలను బట్టి ఈ విషయం తేలిందని ముంబై హైకోర్టుకు సీబీఐ వెల్లడించింది.
2013, జూన్ 3వ తేదీన తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని కనిపించిన జియాఖాన్ కేసులో తదుపరి విచారణ చేయాల్సిన అవసరం కూడా లేదని సీబీఐ స్పష్టంగా పేర్కొంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు 35 నిముషాల పాటు జియాఖాన్ తన ఫ్లాట్ లోనే ఉందని, ఈ సమయంలో సూరజ్ పంచోలికి 400 సెకన్ల పాటు సందేశాలు పంపిందని, అలాగే లేఖ కూడా రాసిందని సీబీఐ పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు జూలై 6వ తేదీకి వాయిదా వేసింది.



