అనూహ్య మలుపులు తిరిగిన తమిళనాడు రాజకీయ సంక్షోభం, ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తీసుకున్న నిర్ణయంతో తొలగిపోయింది. రాజ్ భవన్ లో భేటీ సందర్భంగా పళనిస్వామిని సీఎంగా నియమిస్తున్నట్టు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా, గవర్నర్ పళనిస్వామిని ఆహ్వానించినట్టు రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. దీంతో సాయంత్రం 4 గంటలకు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నాడీఎంకే పేర్కొంది.
పళనిస్వామికి ఈ ఆహ్వానం అందడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, చిన్నమ్మ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. 12వ ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారనే సమాచారం తెలియడంతో గోల్డెన్ బే రిసార్ట్స్ లోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంతోషానికి హద్దులు లేవు. పన్నీర్ సెల్వంకు చుక్కెదురైందంటూ రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. తనకు 125 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ఒక జాబితాను గవర్నర్ విద్యాసాగర్ రావుకు పళని స్వామి అందజేశారు.
అంతకుముందు పళనిస్వామితో రాజ్ భవన్ లో ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు చర్చించిన మీదట, పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు. బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. దీంతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. మరో పక్కన పన్నీర్ సెల్వం వర్గం ఢిల్లీకి పయనం కావాలని నిర్ణయించుకుంది. ఎలక్షన్ కమిషన్ తో భేటీ అయ్యి, తమ అభ్యంతరాలను తెలపనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పన్నీర్ వర్గం ఈసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.



