ఉండి ఎమ్మెల్యే, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అక్కడ గల పురాతన రామాలయాన్ని పునరుద్దరించడానికి వెళ్ళినప్పుడు క్రీస్టియన్ మతంలోకి మారిన కొందరు దళితులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
తమ ప్రాంతంలో రామాలయం నిర్మిస్తే ఊరుకోమంటూ ఘర్షణకు దిగారు. అయితే అక్కడ ఇదివరకు నుంచి ఆలయాన్నే తాము పునరుద్దరిస్తున్నామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
కానీ వారి వెనుక వైసీపీ ఉంది. దళితులు, క్రీస్టియన్ల ముసుగులో అదే రాజకీయం చేస్తోందనే విషయం అక్కడ అందరికీ తెలుసు. రఘురామని అడ్డుకోవాలనుకోవడానికి బలమైన కారణమే కనిపిస్తోంది.
జగన్ అమితంగా ద్వేషించేవారిలో రఘురామ కూడా ఒకరు. ఎంతగా అంటే కాళ్ళు వాచిపోయేలా కొట్టించే అంత! జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రఘురామ ఏపీ సరిహద్దులో కూడా అడుగుపెట్టలేకపోయారు. కానీ ఇప్పుడు ఆయన ఏకంగా డిప్యూటీ స్పీకర్ కుర్చీలో కూర్చుంటే, ఆయన ముందు జగన్ చేతులు కట్టుకొని నిలబడగలరా? జగన్ శాసనసభకు రాకపోవడానికి రఘురామ కూడా ఓ కారణమే కావచ్చు.
కనుక ఆయన ‘ఆకివీడు’లో రామాలయం అనగానే వైసీపీ పావులు కదిపి అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది… తిరుమల వ్యవహారాలతో తల బొప్పి కట్టిన సంగతి అప్పుడే మరిచిపోయి!
‘మేమందరం హిందువులం, హిందూ మత ప్రేమికులం’ అని నిరూపించుకునేందుకు జగన్తో సహా వైసీపీ నేతలందరూ నానా తిప్పలు పడుతున్నారు. కానీ అది కూడా మరిచినట్లే ఉన్నారు. ఒకవేళ గుర్తుంటే పొరపాటున కూడా ఆకివీడు రామాలయం జోలికి వైసీపీ వెళ్ళేదే కాదు. దాని మద్దతుదారులని, ముఖ్యంగా క్రీస్టియన్లని కూడా వెళ్ళకుండా కట్టడి చేసి ఉండేది.
కానీ తిరుమల వెంకన్న తర్వాత ఇప్పుడు శ్రీరాముడితో రాజకీయాలు చేసేందుకు సిద్దమవుతోంది. కనుక మరోసారి తలకు బొప్పి తప్పదు.
ఎమ్మెల్యే రఘురామ నేడు సోషల్ మీడియాలో “ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం, పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం చేపడతాము. జై శ్రీ రామ్!” ఓ పోస్ట్ పెట్టారు.






