మూడవ రోజు సుబ్బరాజుని ప్రశ్నించిన సిట్ అధికారులు, ఈ విచారణ ద్వారా మరికొందరు నటుల పేర్లు రాబట్టినట్లుగా మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. టాలీవుడ్ లో దశాబ్ద కాలాల పాటు సంబంధం కలిగిన రెండు కుటుంబాలు ఇందులో ఉన్నట్లుగా అవుతున్న కధనాలు టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఈ రెండు కుటుంబాలు ఎవరు? అలాగే తెరపైకి రానున్న మరికొందరు సినీ ప్రముఖులు ఎవరు? అన్న ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
ముఖ్యంగా రెండు కుటుంబాల విషయానికి వస్తే… ఇటీవల దగ్గుపాటి సురేష్ మరియు అల్లు అరవింద్ ల పుత్రరత్నాలు ఇందులో ప్రమేయం ఉన్నట్లుగా వచ్చిన వార్తలను మీడియా వేదికగా ఖండించిన విషయం తెలిసిందే. అయితే సిట్ విచారణలో వెలుగుచూసిన రెండు కుటుంబాల పేర్లు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే… ఈ నెల 24వ తేదీన విచారణను ఎదుర్కొననున్న నటుడు నవదీప్ పబ్ లో డ్రగ్స్ అమ్మకాలు జరిగేవన్న విషయం కూడా ఈ విచారణలో వెలుగుచూసినట్లుగా మీడియా ఛానల్స్ వేదికగా ప్రసారం అవుతున్నాయి.
అయితే ఇందులో అసలు నిజానిజాలు ఏమిటన్నది తెలియాలి అంటే… మొత్తం ఈ 12 మంది సెలబ్రిటీల విచారణ అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అధికారికంగా తెలియజేసే అవకాశముంది. ప్రస్తుతం ఎప్పటికప్పుడు మీడియా మీట్ లు నిర్వహిస్తున్నారు గానీ, విచారణకు సంబంధించిన అప్ డేట్స్ ను మాత్రం మీడియా వర్గీయులకు వెల్లడించడం లేదు. మరో వైపు సెలబ్రిటీలు కూడా విచారణకు హాజరవుతున్నారు, తమపై వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నారు. అదే నిజమైతే… మరి విచారణలో కొత్త విషయాలు ఎలా వెలుగు చూస్తాయి?



