ఇది ఆళ్ళతో ఆగేది కాదు… ఆరంభం మాత్రమే?

Alla Nani Resigns From YSRCP

ఎన్నికలలో వైసీపికి కనీసం గౌరవప్రదమైన సీట్లు అంటే ఓ 30-40 గెలుచుకుని ఉండి ఉంటే నేడు ఖచ్చితంగా ఆ పార్టీ పరిస్థితి మరోవిదంగా ఉండేది. కానీ కేవలం 11 సీట్లతో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.

ADVERTISEMENT

ఒకవేళ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి హుందాగా రాజకీయాలు చేసి ఉన్నా నేడు టిడిపి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఇంత భయపడాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ అధికారమధంతో విర్రవీగుతూ ప్రతిపక్షాలను చాలా దారుణంగా వేదించినందున, ఇప్పుడు ఆ పార్టీలో ఉండాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇది జగన్‌ స్వయంకృతమే తప్ప టిడిపిది కాదు.

సాధారణంగా ఇటువంటి సందర్భాలలో నేతలు అధికార పార్టీలోకి మారిపోయి ఇబ్బందుల నుంచి తప్పించుకుంటారు. కానీ వైసీపి నేతలకు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు వారి అధినేత జగన్మోహన్‌ రెడ్డి. వారిచేతే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌, దగ్గుబాటి పురందేశ్వరిలను నోటికి వచ్చిన్నట్లు తిట్టించారు. వారు కూడా తమ అధినేత మెప్పుకోసం చెలరేగిపోయారు.

అలా చెలరేగిపోయిన రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు వంటివారు ఇప్పుడు ఎంత కష్టమైనా జగన్‌ని అంటి పెట్టుకునే ఉండాలి తప్ప వారికి వేరే దారి లేదు. అంటే వైసీపి నుంచి ఎట్టి పరిస్థితులలో ఎవరూ ఇతర పార్టీలలోకి వెళ్ళలేని పరిస్థితి జగన్‌ కల్పించారన్న మాట.

కానీ జగన్‌తో ఉంటే తాము సమస్యలలో చిక్కుకుంటామని భావిస్తున్నవారు ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నట్లు చెప్పగా, తాజాగా మరో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

ఏలూరు జిల్లా వైసీపి అధ్యక్ష పదవికి, నియోజకవర్గం ఇన్‌చార్జి పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల చేతనే వైసీపికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవలే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపికి రాజీనామా చేశారు.

రాజకీయ ప్రత్యర్ధులను వెంటాడి వేటాడాలనే జగన్‌ ఎంచుకున్న విధానం వలననే నేడు వైసీపి నేతలకు ఈ దుస్థితి కలిగిందని చెప్పక తప్పదు. జగన్‌ అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నట్లే, తన సొంత పార్టీ నేతలకు కూడా నష్టపరిచారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories