డబుల్ రోడ్ ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్ ఉంటే అది ఆంధ్రా అంటూ గత తెలంగాణ పాలకులు వైసీపీ హయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి మీద బహిరంగంగానే విమర్శలు గుప్పించే వారు. అయినా కూడా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా ఉండేది కాదు.
తానూ నొక్కిన బటన్లు ఎన్ని అని లెక్కపెట్టుకునే పనిలో బిజీగా ఉన్న జగన్ తన ప్రభుత్వ హయాంలో నాశనమైన వ్యవస్థలెన్ని అనేది గుర్తించలేకపోయారు. గత పాలకుల నిర్లక్ష్యం, చేతగాని తనం ఏపీ రవాణా వ్యవస్థను అతలాకుతలం చేసింది. గుంతల మధ్య రోడ్డులా లేక రోడ్ల మధ్య గుంతలా అనేలా ఏపీ రహదారుల పరిస్థితిని అస్తవ్యస్తం చేసేసారు జగన్.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే అటు రాజధాని అమరావతి పునర్నిర్మాణంతో పాటుగా శిధిలావస్థలో ఉన్న ఏపీ రహదారులను కూడా పునరుద్దరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు నియోజకవర్గ ఎమ్మెల్యే లకు ఇటు అధికారులకు గట్టి సూచనలే చేసారు.
2025 సంక్రాంతి టార్గెట్ గా ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలంటూ ఆదేశాలిచ్చారు. అలాగే ఆ నాటికి వారి వారి సొంత ఊర్లకు వచ్చే ఏపీ వాసులకు గత జగన్ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఈ రోడ్ల మరమత్తులు కార్యక్రంతోనే తేటతెల్లమవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసారు.
ఈ కార్యక్రమాన్ని అలసత్వంగా తీసుకుని తమ నియోజకవర్గ రహదారులను బాగు చేయని ఎమ్మెల్యేల పై తగిన చర్యలు కూడా తీసుకోబడతాయి అంటూ హెచ్చరించడంతో ఈ ఆరు నెలల కూటమి పాలనను తెలియచేయడానికి అందరు సంసిద్ధమయ్యారు.
అలాగే పంచాయితీ రాజ్ శాఖ అనుమతుల కింద రోడ్డు వసతులు సరిగాలేని గ్రామాలలో సైతం సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది ప్రభుత్వం. అందుకు గాను గత మూడు రోజులుగా మన్యం ప్రాంతాలలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ ఇక గిరిజన ప్రాంతాలలో డోలీల సంస్కృతికి చరమ గీతం పాడేలా రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసారు.
అలాగే నేడు కంకిపాడు జిల్లా గుడువర్రు గ్రామంలో పర్యటిస్తున్న పవన్ అక్కడ నిర్మాణ దశలో ఉన్న రోడ్ల నాణ్యతను పరిశీలించి, పలు అభివృద్ధి పనులకు ఆదేశాలు జారీ చేసారు. అయితే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పీడ్ చూస్తుంటే బాబు విజన్, పవన్ ఇంప్లిమెంటేషన్ కచ్చితంగా ప్రజలు ఆశించిన ఫలితాలను సాధించేలా కనిపిస్తున్నాయి.
గత ఐదేళ్ల వైసీపీ పాలనకు, కూటమి ప్రభుత్వ ఆరు నెలల విధానాలకు మధ్య వ్యత్యసానికి సంక్రాంతి పండుగ వేదికగా నిలవబోతుంది. దీనితో ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న కూటమి పాలన హిట్టా, ఫట్టా అనేది బాక్స్ ఆఫీస్ ముందర కాకుండా ప్రజల మధ్య తేలుతుంది.
ఇక్కడ కలెక్షన్లు అంటే ప్రభుత్వానికి వచ్చే రివార్డులే. అయితే ఈ సంక్రాంతికి అటు సినీ పరిశ్రమతో పాటుగా ఇటు కూటమి ప్రభుత్వం కూడా ప్రజా తీర్పు కోసం ఆశగా, ఆసక్తిగా ఎదురు చూస్తుందన్న మాట.




