బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ ఎవ్వరు ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయింది. ఇక ఆ తరువాత వచ్చిన RRR, పుష్ప, యానిమల్, కల్కి..ఇలా ఒక్కో సినిమా ఒక్కో రికార్డు ను సృష్టిస్తూ పాత సినిమా రికార్డులను బద్దలు కొడుతూ టాలీవుడ్ ఖాతాలో ఆస్కార్ అవార్డు వచ్చి చేరే స్థాయికి చేరింది.
అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాదిరి టాలీవుడ్ కి ఒక వైపు మాత్రమే అన్నట్టుగా ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమ ఎన్నడూ చూడని వివాదాలను ఎదుర్కొంటు, ఎప్పుడు లేని రాజకీయ సమస్యలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. అయితే తాజగా టాలీవుడ్ ను చుట్టుముట్టిన మరో వివాదం థియేటర్ల బంద్.
ఇప్పుడు ఈ ఒక్క ప్రకటన టాలీవుడ్ కు ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి మధ్య దూరాన్ని సృష్టించింది. నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు, డిస్టిబ్యూటర్లు అంటూ సామాన్య సినీ ప్రేక్షకుడికి అర్ధం కానీ సమస్యలతో సినీ పరిశ్రమ నుంచి జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అనే ప్రచారం బయటకొచ్చింది.
అయితే జూన్ 12 న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల కానున్న ఈ సమయంలో తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల బంద్ అంటూ ప్రచారం ఊపందుకోవడంతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది.
సుమారు ఐదేళ్ల నుంచి షూటింగ్ లోనే క్వారంటైన్ అయిన హరిహరవీరమల్లు ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించి థియేటర్లలోకి రానున్న ఇటువంటి సమయంలో థియేటర్ల బంద్ అంటూ ప్రకటన రావడంతో అసలు ఇండస్ట్రీలో ఎం జరుగుతుంది అంటూ ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
దానికి తోడు ఇండస్ట్రీలో ఉన్న “ఆ నలుగురే” కావాలని కుట్ర పూరితంగా పవన్ సినిమాను అడ్డుకోవడానికి ఈ బంద్ ప్రచారం తెరమీదకు తెచ్చారు అంటూ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి, జనసేన నాయకుడు కందుల దుర్గేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
అలాగే ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ నుంచి కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి థాంక్స్ అంటూ కొన్ని ప్రశ్నలతో కూడిన ఒక ప్రకటన విడుదలయ్యింది. దీనితో ఆ నలుగురు ఎవరన్న దాని మీద ఎవరి అభిప్రాయాలను వారు సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ కథనాలు సృష్టించారు.
అయితే అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇటు సోషల్ మీడియా వేదికగా కానీ ఆ నలుగురు వీరే అంటూ కొన్ని పేర్లు ఎక్కువగా ప్రచారం జరిగింది. అందులో ఒకరు అల్లు అరవింద్ కాకా మరొకరు దిల్ రాజు, ఇంకొకరు దగ్గుపాటి సురేష్ బాబు పేర్లు బయటకొచ్చాయి.
అయితే ఆ నలుగురిలో నేను లేను అంటూ నిన్న అల్లు అరవింద్ ప్రెస్ ముందుకొచ్చి ఒక క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. అప్పుడు ఉన్న ఆ నలుగురు ఇప్పుడు పదిమంది అయ్యారు, కానీ అది మీ మీడియాకు పట్టదు, అసలు ఒక పెద్ద సినిమా విడుదల ముందు ఇండస్ట్రీ నుంచి ఇటువంటి వివాదాస్పద ప్రచారాలు జరగడం సమంజసం కాదు,
పవన్ కోపంలో న్యాయం ఉంది అంటూ ఆ నలుగురిలో నేను లేను అనే వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేసారు అల్లు అరవింద్. ఇక ఆ నలుగురిలో రెండవ శక్తిగా ప్రచారం పొందిన దిల్ రాజు నేడు మీడియా ముందుకొచ్చి మీడియాలో ప్రచురమవుతున్న ఆ నలుగురిలో నేను కూడా లేను అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు.
అలాగే పవన్ సినిమాను ఆపే సాహసం ఎవ్వరు చెయ్యలేరు అంటూ ఇది పవన్ సినిమా విడుదల సందర్భంగా రాచుకున్న వివాదం కాదు అనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు దిల్ రాజు. దీనితో ఆ నలుగురిలో నుంచి ఈ ఇద్దరు అవుట్ అయినట్టే అయ్యింది.
మరి ఆ మిగిలిన ఇద్దరు కూడా రేపో మాపో మీడియా ముందుకొచ్చి తమకు ఈ వివాదానికి సంబంధం లేదని, ఆ నలుగురి ప్రచారంలో మేము కూడా లేమని చెప్పే ప్రయత్నం చేస్తారా.? లేక జరుగుతున్నఈ ప్రచారం పై ప్రేక్షక పాత్ర పోషిస్తూ గమ్మునుంటారా.?




