అనన్య సామాన్యంగా నమోదవుతున్న “బాహుబలి 2” రికార్డులను కొల్లగొట్టే సినిమా ఇప్పట్లో లేదన్నది అందరూ అంగీకరించే సత్యమే. అయితే ‘బాహుబలి’ ద్వారా పెరిగిన మార్కెట్ ను అలాగే కొనసాగించడానికి మరికొన్ని ‘ఎపిక్’ చిత్రాలు పైప్ లైన్ లోకి రావడం ఆహ్వనించదగ్గ విషయం. ‘బాహుబలి’ రికార్డుల దరిదాపుల్లోకి రావాలంటే… మళ్ళీ రాజమౌళినే ఏ ‘మహాభారతం’ కధనో తెరకెక్కిస్తే తప్ప సాధ్యం కాదన్న టాక్ వెలువడుతున్న నేపధ్యంలో… ‘మహాభారతం’ స్థానంలో ‘రామాయణం’ తెరపైకి వచ్చింది.
అవును… ఈ బ్రేకింగ్ న్యూస్… ‘రామాయణం’ గురించే. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాను మూడు పార్టులుగా విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ ‘రామాయణ్’ విశిష్టత ఏమిటంటే 3డి సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా కేటాయించారు. ఇందు నిమిత్తం ముగ్గురు ట్రేడ్ సినీ దిగ్గజాలు అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన చేతులు కలపనున్నారు.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే వచ్చింది గానీ, ఈ ప్రకటన చాలా సందేహాలను కూడా మిగిల్చింది. ఈ ‘రామాయణ్’కు దర్శకత్వం వహించే ఆ సుప్రసిద్ధ దర్శకుడు ఎవరు? అన్న దానిపైనే సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. అలాగే ‘రాముడు’గా ఎవరు కనిపించబోతున్నారు? ఇతర ప్రధాన పాత్రలలో ఎలాంటి క్రేజీ ఆర్టిస్ట్ లు భాగస్వామ్యం కాబోతున్నారు? ఇలాంటి అనేక క్రేజీ ప్రశ్నలకు నిలయంగా సదరు అధికారిక ప్రకటన నిలిచింది. అయితేనేం… 500 కోట్లతో ‘రామాయణ్’ చరిత్ర తెరకెక్కుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే ‘బాహుబలి’ సాధించిన మార్కెట్ ను కూడా అధిగమించాలని ఆశిద్దాం. అప్పుడే మరిన్ని చారిత్రాత్మక సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను రంజింప చేస్తాయి.



