రామ్ చరణ్ సంక్రాంతికి గేమ్ చేంజ్ చేస్తారో లేదో కానీ అల్లు అర్జున్ మాత్రం చేశారు. నేటికీ పుష్ప-2 కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకపోగా అలాగే దూసుకుపోతున్నాయి.
డిసెంబర్ 4న హైదరాబాద్లో సంధ్య థియేటర్లో పుష్ప-2 ప్రివిలేజ్ షో విడుదలైనప్పుడు జరిగిన ఘటనలతో దాదాపు నెలరోజులు అల్లు అర్జున్ అనేక సమస్యలు, విమర్శలు, కేసులలో చిక్కుకున్నారు.
కనుక అల్లు అర్జున్ జీవితంలో అత్యంత బాధాకరమైన, అత్యంత సంతోషకరమైన రోజులు కూడా డిసెంబర్ నెలలోనే జరిగాయి.
అల్లు అర్జున్ రాజకీయ పార్టీల చదరంగంలో పావుగా మారి ఇబ్బంది పడుతున్నప్పుడు ఎప్పటికైనా ఆయన బయట పడగలరా లేదా?అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ దిల్రాజు చొరవ తీసుకొని ఈ సమస్య నుంచి అల్లు అర్జున్ని బయటపడేశారు.
ఆయన నేతృత్వంలో సినీ ప్రముఖులు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాత ఒక్కసారిగా మంత్ర దండం తిప్పి మాయం చేసిన్నట్లు సమస్యలన్నీ మాయం అయిపోయాయి.
ప్రతీ ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి సంతకం చేయాలని, ముందస్తు అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లరాదనే ఆంక్షలను కూడా నాంపల్లి కోర్టు ఎత్తివేసింది. ఒక్క నెలలోనే గేమ్ చేంజ్ అయిపోయింది కనుక అల్లు అర్జున్కి ఈ కేసు, ఈ రాజకీయాల నుంచి విముక్తి లభించిన్నట్లే భావించవచ్చు. కనుక మళ్ళీ తన తదుపరి సినిమాపై దృష్టి సారించవచ్చు.
పుష్ప-2తో అల్లు అర్జున్ బాలీవుడ్ని కూడా షేక్ చేయడంతో ఇప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా అల్లు అర్జున్తో పాన్ ఇండియా సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ, కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి కూడా వారిలో ఒకరు.
రెండు రోజుల క్రితమే అల్లు అర్జున్ ముంబయి విమానాశ్రయంలో కనిపించడంతో బన్సాలిని కలిసేందుకే వచ్చారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అవి నిజమైతే అల్లు అర్జున్ మరో మెట్టు ఎక్కిన్నట్లే. కాకపోయినా అల్లు అర్జున్ కష్టాలన్నీ ఒక్క నెలలోనే తీరిపోయాయి కనుక ప్రశాంతంగా కొత్త సినిమా చేసుకోవచ్చు.




