గత ఏడాది డిసెంబర్ 4న సంధ్య థియేటర్లో పుష్ప-2 విడుదలైనప్పుడు జరిగిన తొక్కిసలాట జరుగగా రేవతి అనే వివాహిత చనియింది. ఆమె కుమారుడు శ్రీతేజ నేటికీ పూర్తిగా కొలుకోలేదు. ఆ తర్వాత నుంచే తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మద్య దూరం మరింత పెరిగింది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలన్నీ అందరికీ తెలుసు. కనుక వాటి ప్రస్తావన ఇప్పుడు అనవసరం.
కానీ తెలంగాణ ప్రభుత్వం తరపున జయసుధ నేతృత్వంలో ఏర్పాటైన జ్యూరీ నేడు ప్రకటించిన గద్దర్ అవార్డులలో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఎంపిక కావడం విశేషం. అదీ.. ఏ పుష్ప-2 సినిమా వలన సినీ పరిశ్రమకీ తెలంగాణ ప్రభుత్వానికి మద్య దూరం పెరిగిందో, అదే సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు లభించడం విశేషం. ఇది జ్యూరీ పారదర్శకతకు అద్దం పడుతోందని చెప్పవచ్చు.
సంధ్య థియేటర్ వివాదం తర్వాత తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా హైదరాబాద్లో సినీ పరిశ్రమ ఇబ్బంది పడుతుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. కానీ జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలనే పిలుపు తర్వాత ఒక్కసారిగా ఏపీలో కూడా తెలుగు సినీ పరిశ్రమకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది.
అటు తెలంగాణలో, ఇటు ఏపీలో ప్రభుత్వాలతో సంబంధాలు చెడగొట్టుకొని బాధపడుతున్న ఈ సమయంలో అల్లు అర్జున్ని ఉత్తమ నటుడుగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్ కోసం ఎంపిక చేయడం శుభ సూచకమే అనుకోవచ్చు.
కనుక జూన్ నెలలో జరుగబోయే గద్దర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని తెలుగు సినీ ప్రముఖులు సద్వినియోగం చేసుకొని తెలంగాణ ప్రభుత్వంతో మళ్ళీ సత్సంబంధాలు నెలకొల్పుకుంటారని ఆశిద్దాం.




