నిండా మునిగినోడికి చలి ఎందుకు అన్న చందంగా తయారయ్యింది వైసీపీ నాయకుల పరిస్థితి. 151 నుంచి 11 కి పడినా వైసీపీ చేసిన తప్పు తెలుసుకో లేకపోతుంది, వేసిన తప్పటడుగులు సరి దిద్దుకోలేకపోతుంది.
నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న సామెత మాదిరి రాష్ట్ర రాజధాని అమరావతి ముంపు ప్రాంతం అంటూ అదే విష ప్రచారంతో వైసీపీ నిండా మునుగుతుంది. వైసీపీ అధినేత వైస్ జగన్ తో మొదలైన ఈ దుష్ప్రచారం అంచలంచెలుగా ఎదుగుతూ వైసీపీ ని మింగేస్తున్నా వైసీపీ నేతలు ఇప్పటికీ కళ్ళు తెరవడం లేదు.
గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్నా వరదలతో జలాశయాలన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి, అలాగే కాలువలు, నదులు, చెరువులు నీటి నిల్వతో కళకళలాడుతున్నాయి.
వర్షాలతో అమరావతి నిర్మణాల కోసం తవ్విన పునాదులల్లో కూడా నీటి నిల్వ చేరుకోవడంతో ఇక వైసీపీ నేతల నోటికి పనిపడినట్టయ్యింది. అందులో భాగంగానే కేతిరెడ్డి అమరావతి లో పులస ల వేట అంటూ వెటకారం తో వైసీపీ రాజకీయానికి చేపల మషాలా దట్టించారు.
ఇక ఇప్పుడు అంబటి వంతు వచ్చినట్టు ఉంది. వైసీపీ రాజకీయానికి అంబటి వ్యంగ్యం ను జోడిస్తూ తన సోషల్ మీడియాలో ఒక ఫొటోతో కూడిన పోస్టు చేసారు. ఆ ఫొటోలో కనిపిస్తుంది SRM కాలేజ్, “అమరావతి…వలలో కనిపిస్తుంది చేపలు…పులసలు మాత్రం కాదు.!” అంటూ అంబటి తనవంతుగా అమరావతి పై విషం చిమ్ముతున్నారు.
అయితే అంబటి చూపిస్తున్న ఫోటో వాస్తవమే…అయితే అక్కడ SRM కాలేజీ పక్కనే ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వర్షాలతో అది నీటి నిల్వతో నిండుగా ఉంది. మాజీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి ఇక్కడ కాలువ ఉన్న విషయం తెలిసినప్పటికీ ఈ వర్షాలకు అమరావతి మునిగిపోయింది, అందుకు సాక్ష్యం ఇదే అన్నట్టుగా SRM పక్కన వరద నీరు చేరింది అనేలా అంబటి పోస్ట్ కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఆయనకు గూగుల్ మ్యాప్ ను షేర్ చేస్తూ నెటిజన్లు అంబటి రివర్స్ కౌంటర్ ఇస్తున్నప్పటికీ వైసీపీ అమరావతి విషయంలో ఎందుకింత కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోంది.? రాష్ట్ర రాజధాని పై ఎందుకింతలా విష ప్రచారానికి పూనుకుంటుంది అన్న చర్చ విస్తృతంగా జరుగుతుంది.
2019 ఎన్నికల సమయంలో రాజధాని మార్పు లేదు, ఏపీ రాజధాని అమరావతే అంటూ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఒక్క ఛాన్స్ తీసుకున్న వైసీపీ ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ ముఖం పెట్టుకుని రాజధాని ప్రాంతంలో ఓట్లడుగుతారు.? ఇప్పుడు చేస్తున్న విషప్రచారాన్ని ప్రజలు విస్మరించి వైసీపీ కి మద్దతిస్తారా.?
అమరావతిలో వరద నీరు…ఆ నీటిలో పులస చేపలు అంటూ నేడు వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంతో అమరావతి వలలో వైసీపీ చేపలు చిక్కుకుంటున్నాయి. రేపటి రోజున ఈ వలలో నుంచి ఆ వైసీపీ చేపలు తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి.






