రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా ప్రజలు చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకున్నారంటే ఆయన మాత్రమే రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టగలరనే నమ్మకంతో!
వారి అంచనాలకు తగ్గట్లే ఆయన కూడా అనేక సమస్యలు పరిష్కరించి, మరికొన్నిటిని నిబ్బరంగా ఎదుర్కొని అధిగమించి అమరావతి, పోలవరాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. రాష్ట్రంలో సానుకూల వాతావరణం కనిపిస్తున్నందున పరిశ్రమలు, పెట్టుబడులు తరలివచ్చాయి.
అయితే మూడున్నరేళ్ళు గడిచేసారికి క్రమంగా ఆలోచనలు, విధానాలు, పరిస్థితులలో మార్పులు వచ్చాయి. ఆ తర్వాత నుంచి జగన్ 5 ఏళ్ళ విధ్వంస పాలన ముగిసే వరకు జరిగిన కధ అందరికీ తెలుసు.
మళ్ళీ అటువంటి నమ్మకం, ఆకాంక్షలతోనే ప్రజలు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు.
ఇదివరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన లేదా జరిగిన తప్పిదాలు, వైఫ్యల్యాలు, సమస్యలు, విధానపరమైన లోపాలు అన్నీ సిఎం చంద్రబాబు నాయుడుతో సహా కూటమిలో ప్రతీ ఒక్కరికీ తెలుసు.
కనుక మళ్ళీ అవే తప్పులు చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఇప్పటికే 9 నెలలు గడిచిపోయాయి. చివరి 6-12 నెలల్లో ఎన్నికల హడావుడితో ఏమీ చేయలేమని కూడా వారికి, ప్రజలు బాగా తెలుసు.
కనుక మిగిలిన ఈ మూడేళ్ళలో చేయాల్సిన పనులన్నీ చకచకా పూర్తిచేయాల్సి ఉంటుంది. కనుక ఆలోగా చేయగల పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అమరావతి, పోలవరం పనులు పూర్తిచేయడం, పరిశ్రమలు, ఐటి కంపెనీలు ఏర్పాటు చేయడం, మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలి.
కానీ కూటమి ప్రభుత్వం మళ్ళీ తలకు మించిన భారం ఎత్తుకోవాలని ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మరో అరడజను గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, మెట్రో ప్రాజెక్టులు వంటివి అనేకం తలకెత్తుకుంది.
ఇవి అవసరమే కానీ అత్యవసరం కావు. అమరావతి, పోలవరం పనులకే అప్పులు తెచ్చుకొంటునప్పుడు, వీటన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం అసాధ్యమే. కనుక వీటి కోసం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సిందే.
వీటి కోసం గట్టిగా ప్రయత్నాలు చేయడం మంచిదే.. అవసరమే! కానీ వీటి కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పనులకు కేంద్రం సహాయం తీసుకొని పూర్తిచేయడం మంచిది కదా?
ఉదాహరణకు విశాఖ సమీపంలో, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాలకు అందుబాటులో ఉండే భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్-జూలై నాటికల్లా సిద్దమవుతుంది. కనుక ఆలోగా నగరంలో రోడ్లు విస్తరణ చేపట్టి, ఎక్కడికక్కడ ఫ్లై ఓవర్లు నిర్మించాల్సి ఉంటుంది. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు విడుదల చేసింది. కేటాయించి, నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడం చాలా అవసరం. కానీ మెట్రో నిర్మాణం, శ్రీకాకుళంలో మరో విమానాశ్రయం నిర్మాణం అత్యవసరం కాదు.
ఇదేవిదంగా విజయవాడ వేస్ట్ బైపాస్ రోడ్డు పనులు పూర్తిచేయగలిగితే, విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి రాకపోకలు చాలా సులువవుతాయి. కనుక అమరావతిలో మరో విమానాశ్రయం నిర్మాణం కంటే తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఈ బైపాస్ రోడ్ పనులు పూర్తి చేయగలిగితే ఓ పెద్ద పని పూర్తిచేసిన్నట్లవుతుంది కదా?
ఇక వైసీపీ నేతలపై కేసుల హడావుడి పెరిగిపోవడంతో, వైసీపీ వాటిని తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. కూటమి ప్రభుత్వం హామీలు అమలుచేయలేకనే తమపై రాజకీయ కక్ష సాధింపులకు పూనుకుంటోందని ప్రచారం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కూటమి ప్రభుత్వం తమ వైఫ్యల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ కేసులని చూపిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ప్రచారం చేస్తోంది.
శుక్రవారం మహిళా దినోత్సవం రోజున కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుచేస్తుందని అందరూ ఎదురుచూశారు. కానీ చేయలేదు. కనుక కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ విమర్శించగలుగుతోంది. దాని విమర్శలు మహిళలను ఆలోచింపజేయకుండా ఉంటాయా?
కనుక రాష్ట్రాభివృద్ధి, ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టాల్సిన కూటమి ప్రభుత్వం 9 నెలలు గడిచేసరికి, అప్పుడే దారి తప్పుతోందనే భావన ప్రజలలో కలిగేందుకు ఇవన్నీ దోహదపడుతున్నాయి.
అమరావతి, పోలవరం పూర్తిచేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఒకేసారి ఇన్ని పనులతో తలకు మించిన భారం ఎత్తుకొని, ఎన్నికలలోగా అమరావతి, పోలవరం పూర్తిచేయలేకపోతే ఏమవుతుంది? ప్రజలు ఏమనుకుంటారు? ఆలోచిస్తే మంచిది.




