ఏపీలో అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మౌలిక వసతుల సదుపాయాల విషయంలో దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు, నేషనల్ హైవేల 2018 నాటికల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఇందులో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరికలు కూడా జారీ చేసారు. ఇందులోనూ అమరావతి నుండి అనంతపురం వెళ్ళే ఎక్స్ ప్రెస్ వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
దాదాపుగా 393.59 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న అమరావతి – అనంతపురం ఎక్స్ ప్రెస్ వే దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయ రహదారి కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు… 393.59 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ రహదారిలో 185.4 కిలోమీటర్లలో మేర నాలుగు వరుసలు, 208.19 కిలోమీటర్ల పొడవులో ఆరు వరుసలుగా నిర్మించనున్నట్టు తెలిపారు.
అలాగే విజయవాడ – మచిలీపట్నం మధ్య 64.6 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న 9వ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 740.70 కోట్లు ఖర్చవుతుందని, విజయవాడ బెంజిసర్కిల్ వద్ద 618 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఫ్లైఓవర్కు సంబంధించి డిజైన్లు సిద్ధమయ్యాయని, భోగాపురం-భీమిలి, విశాఖపట్టణం-భీమిలి మధ్య నిర్మించనున్న బీచ్ రహదారులతో జాతీయ రహదారులను కలపడం ద్వారా “సౌందర్యమాల” ప్రాజెక్టు సాకారం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.



