అరెస్ట్ చేయాలనుకుంటే కొడాలిని చేసేది కానీ అంబటి దేనికి?

YSRCP leader Ambati Rambabu after release from Rajahmundry jail questioning his arrest

మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం బెయిల్‌పై రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు సిఎం అయినప్పుడే చెప్పాను..నేను జైలుకి వెళ్ళేందుకు సిద్ధమని!

నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి హింసించాలనుకున్నారు. కానీ నన్ను జైల్లో పెడితే భయపడతానని అనుకోవడం అవివేకం. అన్యాయంగా జైల్లో పెట్టినందుకు బాధ పడ్డాను తప్ప జైల్లో పెట్టినందుకు కాదు. మేము అధికారంలోకి వస్తే ఇంతకు ఇంతా అనుభవించక తప్పదు,” అని అన్నారు.

ADVERTISEMENT

ఒకవేళ సిఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలలో ఎవరినైనా అరెస్ట్ చేసి జైలుకి పంపించదలిస్తే ముందుగా తనని, తన భార్య భువనేశ్వరిని, తమ కుటుంబ సభ్యులను శాసనసభలోనే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ ఎమ్మెల్యే కోడలి నానిని ముందుగా జైలుకి పంపించి ఉండేవారు.

తనను జైల్లో పెట్టించి ఎన్నికలలో టీడీపిని రాజకీయం దెబ్బ తీయాలని ప్రయత్నించినందుకు మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డిని ముందుగా జైల్లో పెట్టి ఉండేవారు.

అధికారంలో ఉన్నప్పుడూ, లేని ఈ సమయంలో కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్‌ ముగ్గురి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న మాజీ మంత్రి రోజాని జైల్లో పెట్టించేవారు.

కానీ సత్తెనపల్లిలో డాన్సులు చేసుకునే అంబటి రాంబాబుని కాదు కదా?కానీ వారందరి కంటే ముందుగా అంబటి ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? అనే ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ తెలుసు.

తాడేపల్లి ప్యాలస్‌లో రచించిన వ్యూహంలో భాగంగా అంబటి రాంబాబు రెచ్చిపోయి సిఎం చంద్రబాబు నాయుడుని, అడ్డుకున్న పోలీస్ అధికారులను బూతులు తిట్టారు. అందుకే జైలుకి వెళ్ళారు. అయితే ఇదీ వైసీపీ ప్లాన్‌లో భాగమేనని అయన మాటల్లోనే స్పష్టమవుతోంది. నేడు ర్యాలీతో మరింత స్పష్టమవుతుంది.

అందుకు ఆయన పశ్చాతాపపడ్డారని కుటుంబ సభ్యులు చెప్పుకున్నారు. కానీ తగ్గేదేలే అంటూ అంబటి రాంబాబు మాటలు, చేతలు ఆయనలో ప్రతీకారమే తప్ప పశ్చాతాపం ఏ కోశాన్న లేదని స్పష్టం చేస్తోంది.

అంబటి రాంబాబుని రాష్ట్రంలో కాపు సామాజికవర్గానికి నాయకుడుగా ప్రమోట్ చేసి జనసేనని దెబ్బ కొట్టాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఆయనే దేనికంటే చాలా చక్కగా, స్పష్టంగా, అనర్గళంగా తెలుగులో మాట్లాడగలరు.

కానీ అదొక్కటే సరిపోదని వైసీపీ అధినేత గ్రహించినట్లు లేదు.

కాపు నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే కాపు సామాజిక వర్గం గర్వపడేలా ఉండాలి ఆయన మాట తీరు, వ్యవహార శైలి. వైసీపీలో అలాంటివారు చాలా మందే ఉన్నారు. కానీ బహుశః వారెవరూ జగన్‌ కోసం ఇలా జైలుకి వెళ్ళేందుకు సిద్ధపడి ఉండకపోవచ్చు. కనుక సత్తెనపల్లి లాటరీ అంబటి రాంబాబుకే తగిలింది.

ఇప్పటికే టైగర్ రాంబాబు’ కాపు నాయకుడుగా ప్రమోషన్స్ మొదలయ్యాయి. నేడు రాజమండ్రి నుంచి గుంటూరుకి భారీ ర్యాలీతో అవి ఊపందుకుంటాయి.

కానీ దువ్వాడ శ్రీనివాస్‌ పాపులారిటీనే సహించలేకపోతున్న జగన్‌, అంబటి రాంబాబుకి ఇంత హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఆయన పాపులారిటీ అమాంతం పెరిగిపోతే భరించగలరా?విజయసాయి రెడ్డి వంటి ఎంతగానో పనికొచ్చేవాడినే పక్కన పెట్టేసినప్పుడు అంబటి రాంబాబు ఏపాటి?

ADVERTISEMENT
Latest Stories