వింటున్నారా…ప్రజలారా! అప్పులు కట్టాల్సిన బాధ్యత మీదే అంటా!

Ambati Rambabu

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను,ప్రాజెక్టులు పూర్తి చేయలేని చేతకాని తనాన్ని గత ప్రభుత్వానికి అంటగట్టి చేతులు దులుపుకోవడంలో వైసీపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సిద్దహస్తుడనే చెప్పాలి. నిజం గెలవాలి కార్యక్రమాన్ని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్తున్న భువనేశ్వరి ప్రయత్నం పై తన వ్యంగ్యాస్త్రాలను ప్రయోగిస్తూ మీడియా ముందుకు వచ్చారు అంబటి.

అక్కడ మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాల పేరుతో రాష్ట్రానికి అప్పుల భారం పెంచుకుంటూ పోతున్నారు, అది కూడా సంపూర్ణ మద్యపానం అమలు చేస్తాం అంటూ ఎన్నికల హామీలో ప్రజలకు చెప్పి ఇప్పుడు అదే మద్యం మీద వచ్చే ఆదాయంను అడ్డు పెట్టుకుని అప్పులు తేవడం మీ ప్రభుత్వానికి ఎంత వరకు సమర్ధనీయం అంటూ ఓ విలేకరి ప్రశ్నించారు.

ADVERTISEMENT

అయితే ఆ విలేఖరికి తన వ్యంగ్యంతోనే సమాధానం చెప్పాలనుకోన్నారో లేక వారి ప్రభుత్వ ఉద్దేశాన్ని బహిర్గతం చేసారో తెలియదు కానీ మొత్తానికి వాస్తవాన్ని ప్రజల ముందుంచారు. అప్పులు తెచ్చేది మేమే అయినా అవి కట్టేది మీరేగా అంటూ టక్కున బదులిచ్చారు మంత్రి గారు. అంటే సంక్షేమం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అప్పులకు తమ పార్టీకి కానీ తమకు కానీ ఎటువంటి బాధ్యత ఉండదని వాటి భారం మోసేది ప్రజలే అని నిజం చెప్పి ప్రజల కళ్ళు తెరిపించారు అంబటి.

ఏ ప్రభుత్వమైనా ప్రజాభివృద్ధికై అప్పులు చేస్తుంది, చెయ్యాలి కూడా. కానీ ప్రభుత్వం చేసిన అప్పుతో ఆదాయ మార్గాలను సృష్టించి ప్రజలకు ఉపాధి కలిపిస్తే చేసిన అప్పుకి ఒక విలువ, గౌరవం ఉంటుంది. మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు అప్పులలోనే ఉంది. కానీ అక్కడ ఆ అప్పులతో నీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వేలాది పంట పొలాలను సస్యశ్యామలం చేశారు. ఎందరో నూతన పెట్టుబడిదారులను ఆహ్వానించి వారికీ ప్రభుత్వం నుండి ప్రోత్సహకాలు అందించి స్థానిక యువతకు ఉపాధిని అందించారు.

అలాగే గత ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ అప్పులతోనే ముందుకెళ్లింది. కానీ అక్కడ సంక్షేమం తో పాటు అమరావతి నిర్మాణం, పట్టిసీమ, పోలవరం,శ్రీ సిటీ నిర్మాణం, రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన,అనేక కేంద్ర విద్య, వైద్య సంస్థల ఏర్పాటు ఇలా పలురకాల కార్యక్రమాలతో ఆదాయం సంపాదించే ధోరణితో బాబు ముందుకెళ్లారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పంచడం సరికాదు కదా నాలుగున్నరేళ్లుగా అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఎంతవరకు ఆమోదయోగ్యమో ప్రజలు కూడా ఆలోచించాలి.

ప్రతి ఐదేండ్ల కొకసారి మారే ప్రభుత్వాలు తమ రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించుకోవాలి. కానీ ఇలా అప్పులు చేసి చేతులు దులుపుకుని వాటి బాధ్యత ప్రజలదే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పే రాజకీయ నాయకులను చూసైనా ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకనైనా అప్పులతో కాకుండా ఆదాయంతో కూడిన అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories