వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వం నేరుగా నెలనెలా ఆర్ధికసాయం అందజేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక జగన్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను సృష్టించి లక్షల మంది వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకొని వారందరికీ నెలనెలా రూ.5,000 అధికారికంగా చెల్లిస్తోంది.
అయితే మొదట్లో ఈ వాదనను తీవ్రంగా ఖండించిన వైసీపీ నేతలు మెలమెల్లగా ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు అధ్యక్షతన ప్లీనరీ సమావేశం జరిగింది. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ప్లీనరీలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉండటంపై స్పందిస్తూ, “వైసీపీలో కార్యకర్తలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. నామినేటడ్ పోస్టులు, వాలంటీరు పోస్టులు అన్నీ మనోళ్ళకే ఇచ్చుకొంటున్నాము కదా?అయినా పార్టీలో కష్టపడేవారికి గుర్తింపు లేదని కొందరు దుష్ప్రచారం చేయడం తగదు,” అని అన్నారు. అంటే వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా వాడుకొంటూ దానికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని స్పష్టమైంది.
మొన్న బుదవారం నెల్లూరులో జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం జరిగింది. దానిలో మంత్రి అంబటి రాంబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వాలంటీర్లు అందరూ మన పార్టీకి సమాచారం చేరవేసే సైనికులువంటివారు. కనుక అందరూ పార్టీ పట్ల విధేయంగా, క్రమశిక్షణతో మెలగాలి. కాదని ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యవహరించినా వెంటనే వాలంటీర్ ఉద్యోగంలో నుంచి పీకేస్తాము. పార్టీలో వాలంటీర్లుగా పనిచేసేందుకు చాలా మంది ఉన్నారు. కనుక కొత్తవారిని నియమించుకోగలము,” అని అన్నట్లు తెలుస్తోంది.
వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అని కాస్త ఆలస్యంగానైనా మంత్రులు కూడా దృవీకరిస్తున్నారు. వారు వైసీపీకి సమాచారం అందించే సైనికులు వంటివారని మంత్రి అంబటి రాంబాబు చెపుతున్నారు. కనుక మన ఇళ్ళకు వచ్చే వాలంటీర్లతో వీలైనంత క్లుప్తంగా మాట్లాడటం మంచిది లేకుంటే ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు.



