ఆంధ్ర ప్రదేశ్ మాజీ జలవనరుల శాఖ మంత్రి ఎవరని ప్రశ్నిస్తే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ అరగంట మంత్రి ఎవరంటే టక్కున చెప్పేస్తారు. కానీ గంట, అరగంట, పావుగంట మంత్రులు కూడా ఉన్నందున కొందరు జవాబు చెప్పలేకపోవచ్చు. కానీ సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగకు ఎవరు డాన్స్ చేస్తారంటే టక్కున ‘అంబటి రాంబాబు’ అని సమాధానం చెప్పేస్తారు. అంటే మంత్రిగా కంటే డాన్సర్గానే ఆయనకు ఎక్కువ గుర్తింపు ఉందన్న మాట! అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఏం చేశారో ఎవరికీ తెలీదు కానీ నాడూ నేడూ కూడా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటారని అందరికీ తెలుసు.
వైసీపీలో నుంచి పలువురు నేతలు టీడీపీ, జనసేనలో చేరిపోతున్నారు. కానీ ఇలా కాస్త నోటి దురద ఎక్కువగా ఉన్నవారికి మాత్రం ఆ ఆప్షన్ లేకపోవడంతో జగన్ని అంటిపెట్టుకొని ఉండక తప్పడం లేదు. ఆయన చెప్పిన్నట్లు చేయక తప్పడం లేదు. అలా చేసి చేజేతులా సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
తమ పిర్యాదులపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్లకార్డులు పట్టుకొని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని ధర్నా చేస్తూ తమ విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదేమీ పెద్ద కేసు కాకపోవచ్చు. కానీ వైసీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు తిరుగుతున్నప్పుడు, మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అంబటి రాంబాబు ఇటువంటి చావుకబారు డ్రామాలు చేసి చేజేతులా సమస్యలు కొని తెచ్చుకోవడం అవసరమా?
కూటమి ప్రభుత్వ ‘హిట్ లిస్టు’లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు పేర్లున్నాయి. కానీ ప్రభుత్వం ఇంతవరకు వారి జోలికి వెళ్ళలేదు. “ప్రభుత్వానికి లేని తొందర అంబటి రాంబాబుకి అవసరమా? తమ టోకెన్ నంబర్ పిలిచే వరకు కాస్త ఆగలేరా?” అని తెలుగు తమ్ముళ్ళే ప్రశ్నిస్తున్నారు.




