క్రికెట్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొన్న అంబటి రాయుడుకి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి వైసీపిలో చేర్చుకొన్నారు. కానీ మ్యాచ్ మొదలవక మునుపే అవుట్ అయిపోయారు.
“రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా,” అంటూ అంబటి రాయుడు ట్వీట్ చేశారు.
గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేయించేందుకే ఆయనని పార్టీలో తీసుకొన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ జగన్ ఏమనుకొన్నారో ఏమో… నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలని తాడేపల్లికి పిలిపించుకొని ఈసారి గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేయాలని కోరారు.
కానీ అమరావతిని రాజధానిగా వద్దని జగన్ తీసుకొన్న నిర్ణయం వలన దాని పరిధిలో ఉన్న గుంటూరులో వైసీపికి తీవ్ర వ్యతిరేకత ఉందని, కనుక తాను రిస్కు తీసుకొని గుంటూరు నుంచి పోటీ చేయలేనని, మళ్ళీ నరసారావుపేట నుంచే పోటీ చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు నిష్కర్షగా చెప్పి వెళ్ళిపోయారని తెలుస్తోంది.
గుంటూరు నుంచి తనను పోటీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వేరే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుసుకొన్న అంబటి రాయుడు ఆవేదనతో రాజకీయాలకు దూరంగా అంటే వైసీపికి గుడ్ బై చెప్పేసిన్నట్లు అర్దమవుతూనే ఉంది.
అయితే ఆ మాట నేరుగా చెప్పకుండా ‘రాజకీయాలకు దూరంగా ఉండాలనుకొంటున్నాను’ అంటూ అవకాశమిస్తే బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగానే ఉన్నానని హింట్ ఇచ్చారు.
కానీ గుంటూరులో పరిస్థితి గురించి లావు శ్రీకృష్ణదేవరాయలు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత జగన్ మళ్ళీ అంబటి రాయుడిని బ్యాటింగ్కు దిగమని చెపుతారా?




