దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు అంబేద్కర్, మహాత్మా గాంధీ తదితరులు చూపిన బాటలో నడవడని అందరికీ తెలుసు. కానీ వారి పేరుతో, వారి విగ్రహాలతో రాజకీయాలు చేస్తుంటారు.
అంబేద్కర్ సూచించిన ఏ ఒక్కటీ పాటించనివారు వందల కోట్లు ఖర్చు చేసి 120 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?అంటే రాజకీయ ప్రయోజనాల కోసమే.
హైదరాబాద్, విజయవాడలో 120 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో వాటి పేరుతో ఎటువంటి రాజకీయాలు సాగాయో అందరూ చూశారు.
ఇప్పుడు అంబేద్కర్ పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచితంగా మాట్లాడారంటూ ఢిల్లీలో కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు చాలా హడావుడి చేస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీలు ఏదో ఓ అంశం అందిపుచ్చుకొని అధికార పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. కనుక ఇప్పుడు అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నట్లు భావించవచ్చు.
అంబేద్కర్ అంటే తమకు మాత్రమే గౌరవం ఉన్నట్లు మాట్లాడుతున్న రాజకీయ నాయకులు మన సినీ నటుల కంటే గొప్పగా నటించేస్తున్నారు.
కానీ నేటికీ అన్ని రాజకీయ పార్టీలు బడుగు బలహీన వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయే తప్ప వారి సంక్షేమం పట్ల ఆసక్తి, నిబద్దత లేదు. వారి కోసం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు కూడా ఓటు బ్యాంక్ రాజకీయలే అని ఎన్నికల సమయంలో జగన్, వైసీపీ నేతలు పదేపదే బహిరంగంగా చాటింపు వేసుకున్నారు కూడా.
కనుక బడుగు బలహీన వర్గాల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే అంబేద్కర్ పేరుతో, విగ్రహాలతో వారిని ఆకట్టుకోవాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. అంటే మన రాజకీయ నాయకులు తమ రాజకీయాల కోసం మహనీయులను ముడిసరుకుగా ఉపయోగించుకుంటున్నాయని చెప్పక తప్పదు. వారి పట్ల గౌరవం లేకపోతే పాయే.. వారిని ఈవిదంగా ఉపయోగించుకోవడం ఇంకా దారుణం కదా?




