
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు గన్నవరం మండలంలో కొండపావులూరులో ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ 10 వ బెటాలియన్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో జగన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు.
“ప్రకృతి విపత్తులు సంభవిస్తే సహాయ చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ ఉంది. కానీ మానవ (జగన్) తప్పిదంతో ఏపీలో గత 5 ఏళ్ళుగా జరిగిన విధ్వంసాన్ని ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి సరిచేయవలసి వస్తోంది,” అని అన్నారు.
Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?
“ప్రధాని మోడీ స్వయంగా భూమిపూజ చేసిన అమరావతిని జగన్ దెబ్బ తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు. జగన్ 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. కనుక అంతకు మూడింతలు సాయం అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోడీ సిఎం చంద్రబాబు నాయుడుకి సాయపడుతున్నారు.
ఈ ఆరు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా నిధులు అందించింది. సుమారు రూ.3 లక్షల కోట్లు విలువగల ప్రాజెక్టులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపడుతున్నాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్తో రాష్ట్ర ప్రజలకున్న అనుబంధం గుర్తించి రూ.11,440 కోట్లు నిధులు విడుదల చేశాము.
Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…
వైజాగ్ స్టీల్ ప్లాంట్కి నిధులు విడుదల కంటే దానిని కాపాడుకోవడమే మా ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను,” అంటూ అమరావతి, పోలవరం, ఎయిమ్స్ హాస్పిటల్తో సహా రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత నిధులు విడుదల చేసిందో అమిత్ షా వివరించారు.
సిఎం చంద్రబాబు నాయుడు చక్కటి ప్రణాళిక, ఆర్ధిక విధానాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారని, కనుక ఆయనకు కేంద్ర ప్రభుత్వం అన్ని విదాల సహాయ సహకారాలు అందిస్తూ ఆయన వెనుక కొండంత అండగా నిలబడతామని అమిత్ షా చెప్పారు. ప్రధాని మోడీ, చంద్రబాబు నాయుడు కలిసి రాబోయే 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరూ ఊహించనంతగా అభివృద్ధి చేసి చూపించబోతున్నారని అమిత్ షా అన్నారు.
Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్కి తొలి విగ్నం.. వాళ్ళేనా?
జగన్ వలన అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయాయని అమిత్ షా ఇప్పుడు చెప్పడం కంటే, అప్పుడే జగన్ని గట్టిగా హెచ్చరించి అడ్డుకొని ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంతగా నష్టపోయేది కాదు. ఇప్పుడు ఆ నష్టాన్ని సరిచేసేందుకు లక్షల కోట్లు ఖర్చు చేయవలసి వచ్చేదీ కాదు.
అప్పుడు మోడీ, అమిత్ షాలు జగన్ని ఎందుకు అడ్డుకోలేదో వారికే తెలియాలి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతగా మేలు చేస్తున్నందుకు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ సంతోషమే! ఈ సభలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అమిత్ షా మాట్లాడిన మాటలు అమృతం పంచుతున్నట్లే ఉన్నాయి.
ముఖ్యంగా దావోస్ సదస్సుకి ముందు అమిత్ షా ఏపీకి వచ్చి చెప్పిన ఈ మాటలు రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి కేంద్ర ప్రభుత్వం కూడా భరోసా ఇస్తున్నట్లుగానే ఉన్నాయి. ఏపీలో సానుకూల రాజకీయ వాతావరణం నెలకొని ఉందని చాటి చెప్పిన్నట్లయింది.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ సదస్సు నుంచి రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు, మరిన్ని పెట్టుబడులు సాధించుకు వచ్చేందుకు అవకాశం పెరిగిందని భావించవచ్చు.