ఎవరికైనా ఏదైనా ఒక విషయంలో మనసులో ఆందోళన ఉంటే దాని గురించే ఆలోచిస్తూ, దాని గురించే మాట్లాడుతుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూ.ఎన్టీఆర్ భేటీ జరిగినప్పటి నుంచి వైసీపీ నేతలు దాని గురించే మాట్లాడుతుండటం గమనిస్తే వైసీపీ చాలా ఆందోళన చెందుతోందని అర్దమవుతోంది. కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, వారి భేటీతో టిడిపి దాని అధినేత చంద్రబాబు నాయుడు నష్టపోబోతున్నారని వాదిస్తున్నారు. ఒకవేళ ఆవిదంగా జరుగుతుందని చంద్రబాబు నాయుడు భావించి ఉండి ఉంటే ఆయనతో సహా టిడిపి నేతలందరూ వారి భేటీపై స్పందించి ఉండేవారు కానీ ఇంతవరకు ఎవరూ ఆ విషయం గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.
గతంలో ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీ బ్యానర్లతో టిడిపిలో చిచ్చుపెట్టేందుకు విఫలయత్నం చేసిన వైసీపీ, మళ్ళీ ఇప్పుడు అటువంటి ప్రయత్నమే మరోసారి చేస్తున్నట్లుంది. ఈ వితండవాదనతో టిడిపిలో జూ.ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. పనిలో పనిగా నందమూరి కుటుంబంలో కూడా మళ్ళీ చిచ్చు రగిలించాలని ప్రయత్నిస్తోంది. అయితే వైసీపీ వాదనలను టిడిపిలో ఎవరూ స్పందించకపోవడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
అమిత్ షా-జూ.ఎన్టీఆర్ భేటీతో ఏం జరుగుతుంది?అని ప్రశ్నించుకొంటే 1. ఏమీ జరగదు. ఎందుకంటే జూ.ఎన్టీఆర్ రాజకీయాల నుంచి తప్పుకొన్నాక చాలా ప్రశాంతంగా సినిమాలు చేసుకొంటూ మంచిపేరు సంపాదించుకొంటున్నారు కనుక మళ్ళీ ఈ రొచ్చులో కాలుపెట్టాలనుకోవడం లేదు. 2. బిజెపి ఒత్తిడికి లొంగవలసివస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో తప్ప మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో, అలాగే ఉత్తరాది రాష్ట్రాలలో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు. 3. ఒకవేళ బిజెపి, టిడిపి, జనసేనలు మళ్ళీ కలిస్తే జూ.ఎన్టీఆర్ తప్పకుండా ఏపీలో వాటి తరపున వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఖాయం.
ఈ మూడో కారణం వలననే వైసీపీ భయపడుతోందని చెప్పవచ్చు. టిడిపి, జనసేనలు ఎక్కడ పొత్తులు పెట్టుకొంటాయో అని భయపడుతూ వాటి మద్య విభేదాలు సృష్టించి, అవి దగ్గరవకుండా ఉంచేందుకు సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా ఆ పార్టీలో అందరూ ప్రయత్నిస్తుండటం వారి మాటలలోనే వినిపిస్తోంది.
ఒకవేళ బిజెపి కూడా టిడిపితో చేతులు కలిపితే, వాటి తరపున జూ.ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే, వైసీపీ కనబడకుండా కొట్టుకుపోతుందని వేరే చెప్పక్కరలేదు. టిడిపిలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇంకా హేమాహేమీలైన నేతలు, జనసేనలో పవన్ కళ్యాణ్, నాగబాబు తదితరులు, బిజెపి తరపున ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ అమిత్ షా తదితరులు, వీరందరికీ మద్దతుగా జగన్ చేతిలో అవమానాలు ఎదుర్కొన్న తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు కలిసి ముప్పేటదాడి చేస్తే ఏ సంక్షేమ పధకాలు వైసీపీని కాపాడలేవని చెప్పవచ్చు. అందుకే ఆ మూడు పార్టీలు కలవకూడదని, జూ.ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాలలోకి రాకూడదని వైసీపీ తరపున మంత్రి రోజా తిరుపతి వెంకన్నకు మొక్కుకొనేందుకే తరచూ తిరుమల వెళుతున్నారేమో?



