బావా… చీర చొక్కా విడిపోవాలి.. పెద్దిలో ఐటెం సాంగ్… వ్రాయడానికి 50 రోజులు పట్టిందని అనంత శ్రీరాం చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే… మన తెలుగు భాషకి సంబంధించి ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పుకోవాల్సిందే…
సమాచారం (డాటా)ని ఎంబీలు, జీబీలు, గిగాబైట్స్, టేర్రాబైట్స్లో కొలిచి దానికి తగ్గట్లు స్టోరేజీతో ఫోన్లు, కంప్యూటర్లు, ఎక్కడికక్కడ అతిపెద్ద డేటా సెంటర్లు, క్లవుడ్ కంప్యూటింగ్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాము.
కానీ మన తెలుగు పండితుల మెమొరీ పవర్, వారి మెమొరీ స్టోరేజ్ కెపాసిటీ గురించి ఎంత మందికి తెలుసు?మన తెలుగు పండితులు, మన తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పే అవధానం, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, శత శాస్రవాధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఈ అవధాన ప్రక్రియ గురించి అందరికీ సులువుగా అర్ధమయ్యేందుకు… స్కూల్లో టీచర్ విద్యార్ధులని ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ అవధానం ప్రక్రియలో ఇది రివర్స్.
అష్టావధానంలో 8 మంది, శతావధానంలో వంద మంది, సహస్రావధానంలో వెయ్యి మంది… ఇలా ఒకరి తర్వాత ఒకరు అవధానిని ప్రశ్నలు అడుగుతుంటారు.
అవి రామాయణం, మహాభారతం లేదా శ్రీరాముడు కారెక్కి, రైలెక్కి, బసెక్కి.. అంటూ చిత్ర విచిత్రమైన పదాలు కలిపి వాటితో సరైన సమాధానం చెప్పమని సవాలు విసురుతారు.
కొందరు వ్యాకరణం, ఛందస్సు లేదా వర్తమాన రాజకీయాలు, సినిమాలు, సామాజిక పరిస్థితులు మరేదైనా అడుగుతారు.
ముందు ఎవరు ప్రశ్న అడిగారో వారి తర్వాత వరుసగా ఎవరెవరు ఏయే ప్రశ్నలు అడిగారో అవధాని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే వరుసలో అందరికీ సమాధానాలు చెప్పాలి. సరిగ్గా చెప్పాలి. చమత్కారంగా చెప్పాలి. అప్పటికప్పుడు ఆలోచించి ఆశువుగా చెప్పాలి.
మెమొరీ స్టోరేజ్, ర్యామ్ స్పీడ్, ఐక్యూ వంటి పదాలు ఏవీ తెలియని కాలంలోనే ఈ అవధాన ప్రక్రియ మన తెలుగువారికి ఉంది. అంటే మన తెలుగు పండితులు, మన భాష గొప్పదనం అర్ధమవుతోంది కదా?
ఇప్పుడంటే మన ఫోన్ లేదా కంప్యూటర్ వగైరాలలో స్టోరేజ్ స్పేస్ నిండిపోయి స్లో అయిపోతుంటాయి. కానీ నాడు అవధానంలో స్టోరేజ్ స్పేస్ ఎప్పుడూ ఉంటుంది. ఎంత స్టోరేజ్ నింపితే ర్యామ్ స్పీడ్ అంతగా పెరుగుతూనే ఉంటుంది. పైగా ప్రశ్నలకు వారు స్పందించే వేగం (స్పీడ్) కూడా చాలా ఎక్కువే.
ఇంత గొప్ప అవధాన ప్రక్రియ క్రమంగా కనుమరుగవుతోంది. అందుకు ఎవరూ బాధ పడటం లేదు కూడా. ఒకవేళ బాధపడినా ప్రయోజనం లేదు కూడా.
ఇప్పుడు అవధానం గురించి ఎందుకు అంటే పెద్ది సినిమాలో ఐటెం సాంగ్ “హల్లల్లల్లో .. చొక్కా చీర విడిపోవాలోయ్ బావ…” అనే పాట వ్రాయడానికి తనకు 50 రోజులు పట్టిందని అనంత శ్రీరామ్ చెప్పిన జవాబే స్పూర్తి.
ఆయన వంటి గొప్ప పండితుడు, ఇంకా సరస్వతీ పుత్రులు ట్యాగ్ తగిలించుకున్న పాటల రచయితలు రెండు మూడు భాషలను మిక్సీలో రుబ్బి సంకర భాషలో ఐటెం సాంగ్స్ వ్రాస్తుండటం, ఆ పాటల కోసం కుర్చీలు మడత పెట్టి తాము 50 రోజులు కష్టపడ్డామని గొప్పగా చెప్పుకొంటునప్పుడు నవ్వాలో ఏడ్వాలో తెలీదు.
కానీ ఎవరైనా ట్రెండ్ ఫాలో కావాల్సిందే… కనుక ఏమైనా వ్రాయాలి.. ఎలాగైనా చేయాలి… తప్పదు! లేకుంటే అడ్రస్ లేకుండా పోతారు.!




