రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఆంధ్రాలో ఖాళీ అవుతున్న నాలుగు సీట్లతో కలిపి దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలలో మొత్తం 24 సీట్లకు జూన్ 18న ఎన్నికలు జరుగుతాయి.
ఎన్నికల షెడ్యూల్: జూన్ 1న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి జూన్ 8 వరకు నామినేషన్స్ దాఖలుకు గడువుంది. జూన్ 9న నామినేషన్స్ పరిశీలన, నామినేషన్స్ ఉపసంహరణకు 11 వరకు గడువుంది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఈ ఎన్నికలలో శాసనసభ్యులు ఓటర్లు కనుక సంఖ్యా బలమున్న కూటమి పార్టీలకే ఈ నాలుగు సీట్లు దక్కుతాయి. వీటికి వైసీపీ పోటీ పడలేదు కనుక అభ్యర్ధిగా పేరు ఖరారు చేయించుకోగలిగితే చాలు రాజ్యసభలో అడుగు పెట్టేసినట్లే. కనుక నాలుగైదు నెలల ముందు నుంచే ఈ సీట్ల కోసం కొందరు లాబీయింగ్ మొదలుపెట్టేశారు.
ఒక పార్టీకే నాలుగు సీట్లు పంచుకోవడం చాలా కష్టం. వాటిలో రెండు సీట్లు జనసేన, బిజేపిలకు ఇచ్చేస్తే టీడీపికి మిగిలేవి రెండే సీట్లు. వాటికి పార్టీలో చాలా మంది పోటీ పడుతుంటారు. కనుక వాటికి అభ్యర్ధులను ఖరారు చేయడం ఇంకా పెద్ద తలనొప్పి వ్యవహారమనే చెప్పాలి. ఈ లెక్కలు చూస్తే ఎవరైనా అవుననే అంగీకరిస్తారు.
ఆ రెండు సీట్లకు అభ్యర్ధులను ఖరారు చేయాలంటే, ముందుగా మంత్రి పదవులు దక్కని సీనియర్లకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికలలో టికెట్ ఇవ్వలేక భవిష్యత్లో అవకాశం ఇస్తామని హామీ పొందినవారినీ విస్మరించడానికి లేదు.
వారితో పాటు కొత్తగా చేరిన పెద్ద తలకాయలకి చాలా ఆశ ఉంటుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ తదితర కుల సమీకరణాలు, కుదిరితే మత సమీకరణాలు ఉండనే ఉంటాయి. ప్రాంతాల ప్రాతినిధ్యాల లెక్కలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మహిళలకు కనీసం ఒక్క సీటు ఇవ్వకపోతే వారికి అన్యాయం చేసినట్లే అని తీర్పు చెప్పేందుకు జగన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
ఇక మూడు పార్టీలు ఒకే కులం లేదా ఒకే మతం లేదా ఒకే ప్రాంతానికి చెందినవారికి సీట్లు కేటాయించడానికి వీల్లేదు. అలా చేస్తే అసంతృప్తి సెగలు మొదలవుతాయి. కనుక మూడు పార్టీలు ఈ కుల,మత, ప్రాంతాల లెక్కలపై చర్చించుకొని వేర్వేరు వర్గాలకు చెందిన అభ్యర్ధులను ఖరారు చేయాల్సి ఉంటుంది.
ఈ నేపధ్యంలో రాజ్యసభ సీట్లు ఆశిస్తున్నవారి జాబితాని ఓసారి చూద్దాం. టీడీపిలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కంబంపాటి రామ్మోహన్ రావు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, వర్ల రామయ్య, చింతకాయల విజయ్, ఎంఏ షరీఫ్ ఇంకా మరో అరడజను మంది రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. కనుక ఈ లెక్కలన్నీ చూసుకొని వారిలో నుంచి ఇద్దరు అభ్యర్ధులను ఎంపిక చేయడం సిఎం చంద్రబాబు నాయుడుకి కత్తి మీద సాము వంటిదే అని చెప్పొచ్చు.




