విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మధ్యన భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు జూన్ నెలాఖరుకి ముగుస్తాయి. జూలై 5న ప్రధాని మోడీ ప్రారంభోత్సవానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంతకాలం సేవలు అందిస్తున్న విశాఖ విమానాశ్రయం (వీటిజెడ్) జూలై 8 నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని ప్రయాణికులకు తెలియజేస్తోంది.
భోగాపురం విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు చక్కటి రన్వేలు సిద్దమయ్యాయి. కానీ విమానాశ్రయం చేరుకునేందుకు, విమానాలు దిగి ఇళ్ళకు చేరుకునేందుకు ప్రయాణికులు వేలాది వాహనాలతో నిండిన ఇరుకు రోడ్లలో ప్రయాణించాల్సి ఉంటుంది.
జగన్ విశాఖ రాజధాని అంటూ కాకమ్మ కబుర్లు చెపుతూ 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు తప్ప నగరంలో కొత్తగా ఒక్క ఫ్లై ఓవర్ నిర్మించలేదు.
రెండేళ్ళ క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భోగాపురం విమానాశ్రయంపై దృష్టి పెట్టి శరవేగంగా నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. కానీ అది కూడా కొత్తగా ఒక్క ఫ్లై ఓవర్ నిర్మించలేదు.
కనుక భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కాగానే అటు ప్రయాణికులకు ఇరుకు రోడ్లలో డజను పైగా ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ రద్దీతో తిప్పలు తప్పవు. అలాగే వారి వాహనాలతో నగర ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడక తప్పదు.
ప్రస్తుతం విశాఖ నగరంలో ఇరుకు రోడ్లు, వాహనాల రద్దీతో అంబులెన్సులకు కూడా దారి దొరకని పరిస్థితి నెలకొని ఉంది. సిఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బయలుదేరితే ఇక సరే సరి. రోడ్లపై వాహానాలు ఎక్కడివక్కడే నిలిపివేస్తుంటారు.
జూలై 5న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే విశాఖ నగరం.. ప్రజలు, ప్రయాణికుల పరిస్థితి ఏమిటి?
విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత హటాత్తుగా రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయిన తర్వాత అప్పుడు రోడ్లు బ్లాక్ చేసి రోడ్ల విస్తరణ లేదా ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు చేపట్టడం తెలివైన పనేనా?




