తెలంగాణా రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు భారీ స్థాయిలో వేతనాలు, అలవెన్సులు పెంచాలని ఎమినిటిస్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, తెలంగాణా రాష్ట్రంలో కాదు, ఏపీలోనూ భారీ స్థాయిలో పెంపు ఉండాలన్న నివేదికను ఎమినిటిస్ కమిటీ చంద్రబాబు సర్కార్ ముందుంచింది. ఈ ప్రతిపాదనలకు వచ్చే వారం అసెంబ్లీలో ఆమోదముద్ర పడితే దాదాపుగా ఒక లక్ష రూపాయల వరకు అదనంగా ఎమ్మెల్యే అకౌంట్ లో పడనున్నాయి.
ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనంగా ఉన్న 12 వేల రూపాయలను అలాగే ఉంచుతూ, అలవెన్సులను మాత్రం పెంచాలని కమిటీ తీర్మానించింది. 83 వేలుగా ఉన్న అలవెన్సులకు మరో 45 వేల రూపాయలను జత చేయనుండగా, అద్దె భత్యం క్రింద ఇస్తున్నటువంటి 25 వేల రూపాయలను 50 వేలు చేయాలని నిర్ణయించారు. అలాగే నియోజక వర్గ అభివృద్ధి ముద్రణ తదితరాల కోసం 30 వేలు అందనుంది. మొత్తం కలిపితే ఒక లక్ష రూపాయల వరకు అదనంగా రానున్నాయి.
అలాగే వాహన రుణాలను 15 నుండి 40 లక్షల వరకు పెంచాలని, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పెన్షన్ మొత్తాన్ని 15 నుండి 30 వేలు చేయాలని కమిటీ ఆమోదం తెలిపింది. అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండే వారికి మాత్రం పెంపు మొత్తాన్ని 75 వేలుగా మాత్రమే నిర్ణయించారు. ప్రజాప్రతినిధులకు వచ్చే రాబడి కావడంతో ప్రతిపక్షాలు కూడా ఎలాంటి వివాదం లేకుండా అసెంబ్లీ ఆమోదం పొందుతుందని చెప్పవచ్చు.



