ఐదేళ్ల నిర్లక్ష్యం, ఐదేళ్ల నిశ్శబ్దం, ఐదేళ్ల చీకటి తరువాత వెలుగును చూసింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. గొర్రె కసాయి వాడిని నమ్మి మోసపోయినట్టు 2019 ఎన్నికలలో అమరావతి ప్రాంత ప్రజలు సైతం జగన్ మాయమాటలకు పడిపోయారు.
నమ్మించి గొంతు కోయడం ఆ కసాయి వాడికి ఎలా అయితే అలవాటో అలాగే నమ్మించి వంచన చేయడం కూడా వైసీపీ కి అలవాటే అని తెలుసుకునే సరికే అమరావతికి జగన్ అనే గ్రహణం పట్టేసింది. ఆ గ్రహణం వీడడానికి ఐదేళ్ల పోరాటాలు, ఐదేళ్ల విధ్వంసాలు, ఐదేళ్ల మౌన రోధనలు సాక్ష్యాలుగా మిగిలియాయి.
అయితే 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఏపీ కి ఊపిరొచ్చింది, అమరావతికి వెలుగొచ్చింది. మూడు రాజధానులు అంటూ జగన్ చేసిన రాజకీయానికి ఏపీలో పారిశ్రామిక రంగం కుప్పకూలిపోయింది. ఒక ప్రభుత్వాన్ని నమ్మి రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.
ఒక ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు మూటాముల్లె సర్దుకుని పక్క రాష్ట్రాలకు పారిపోయారు. సాక్ష్యాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునాది రాయి పడ్డ అమరావతికి జగన్ సమాధి కట్టారు. ఇవన్నీ గత ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనతలు.
ఒక ప్రభుత్వం దార్శికతకు, ఒక నాయకుడి విజనరికి కొండలు కూడా మహానగరాలుగా మారుతాయని CBN హయాంలో సైబరాబాద్ నిరూపిస్తే, ఒక ప్రభుత్వ మూర్కత్వనికి, ఒక నాయకుడి అహానికి అన్ని వసతులు ఉన్న నగరం కూడా అరణ్యంగా మారగలదని జగన్ హయాంలో అమరావతి నిరూపించింది.
ఐదేళ్ల వైసీపీ నిర్లక్ష్యానికి అమరావతి ముళ్ల కంపలకు, పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది. ఆంధ్రప్రదేశ్ భావితరం భవిష్యత్తు “అరణ్యవనంగా” మారిపోయింది. దీనితో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పాపాలను కడిగే ప్రయత్నం మొదలుపెట్టింది.
ఇందులో భాగంగా రాజధాని అమరావతిలో పాతుకుపోయిన ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు తొలిగించడానికి ఏపీ CRDA జంగిల్ క్లియరెన్స్ కోసం టెండర్లను ఆహ్వానించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక మునుపే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది CRDA .
అయినప్పటికీ ఐదేళ్ల వైసీపీ విధ్వంసాన్ని తొలగించడానికి భారీ యంత్ర సామాగ్రి అవసరం కావడంతో 36 . 50 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించింది ప్రభుత్వం. సాధ్యమైనంత అతి తక్కువ సమయంలో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసి అమరావతిని పునర్నిర్మించాలనే గట్టి ఆశయంతో పని చేస్తుంది ఏపీ ప్రభుత్వం.
దేశంలోనే అమరావతిని ఒక ఉన్నత స్థానంలో కుర్చోపెట్టాలని చూసిన CBN కు అమరావతిని అరణ్యంలా మార్చి చూపించారు జగన్. గత పాలకుల నియంత పాలనకు బలైన అమరావతి ‘అరణ్యరోదన’ కు కూటమి ప్రభుత్వం ‘ఊరట’నిచ్చింది.




