వైఎస్ షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్లో చాలా ఉత్సాహంగా ఉందిప్పుడు. ఇంతకాలం కనబడకుండా పోయిన ఏపీ కాంగ్రెస్ నేతలందరూ ఆమె రాకతో బయటకు వచ్చి చాలా హడావుడి చేస్తున్నారు. ఆమెను చూసే అన్ని పార్టీల నేతలు ఏపీ కాంగ్రెస్లోకి క్యూకడతారని ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇది నిజం కూడా.
మరో విశేషమేమిటంటే, కాంగ్రెస్ పార్టీ 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్దమవుతోంది. ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి నేటి నుంచి విజయవాడలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘ఆంద్ర రత్న భవన్’లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
వైఎస్ షర్మిల రాకతో ఏపీ కాంగ్రెస్ మళ్ళీ ఉత్సాహంతో ఉరకలు వేస్తోందని, కనుక ఎన్నికలలో పోటీ చేసేందుకు భారీగా దరఖాస్తులు వస్తాయని పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నందున అన్ని పార్టీలు తమతమ అభ్యర్ధులను ఖరారు చేసుకుంటున్నాయి. కనుక ఏపీ కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టిన్నట్లు పైకి కనబడుతున్నప్పటికీ, ఇది ఇతర పార్టీల నేతలకు, ముఖ్యంగా వైసీపి నేతలకు గాలం వేసేందుకే అని భావించవచ్చు.
వైఎస్ షర్మిల వచ్చీరాగానే రాష్ట్ర పర్యటన ప్రారంభించేసి, అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ అందరి దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నారు. ఆమె జగన్మోహన్ రెడ్డిని ఢీకొని పోరాడుతారనే నమ్మకం, ప్రజలకు, ముఖ్యంగా వైసీపి నేతలకు కలిగించేందుకే ఆమె పర్యటనలు, విమర్శలని అర్దమవుతూనే ఉంది.
కనుక ఇదే సమయంలో పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేయాలనుకునేవారి నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం మొదలుపెట్టడంతో వైసీపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకునేవారు త్వరపడాలని ఆలస్యం చేస్తే కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్స్ దొరకవని సూచిస్తున్నట్లే భావించవచ్చు.
ఇప్పటికే నాలుగు జాబితాలతో వైసీపి అల్లకల్లోలంగా మారింది. త్వరలో 5వ జాబితా కూడా వస్తే మరింత మంది బయటకు వెళ్ళిపోయేందుకు సిద్దపడతారు. కనుక ఏపీ కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ, ఇప్పుడు ఈ టికెట్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ టైమింగ్స్ అద్భుతంగా ఉన్నయని చెప్పవచ్చు.




