కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాండవులను చావు దెబ్బ తీయడానికి కౌరవులు పద్మవ్యూహం రచించినట్లు, ఏపీలో కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీల మద్య ఐక్యతని విచ్చినం చేసేందుకు వైసీపీ కూడా ఓ పద్మవ్యూహం రచించింది. అదే కాపు సామాజిక వర్గం పేరుతో రాజకీయాలు చేయడం.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీలో కమ్మ సామాజిక వర్గం నేతలను టార్గెట్ చేసుకొని రాజకీయాలు చేసేది. కానీ ఇప్పుడు వారిని వదిలి కాపుల వెంట పడుతోంది. దేనికి? అంటే నాడు టీడీపి మూలాలని దెబ్బ తీస్తే చాలనుకుంది. కానీ ఇప్పుడు కూటమి మూలాలను దెబ్బ తీయాలంటే కాపు రాజకీయాలతోనే సాధ్యమని భావిస్తునట్లుంది కనుక!
జనసేనని, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ని దెబ్బ తీయడం ద్వారానే కూటమిని విచ్చినం చేయవచ్చని వైసీపీ మొదటి నుంచి బలంగా నమ్ముతోంది. కనుక కాపు సామాజికవర్గాన్ని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ, కూటమి ప్రభుత్వంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలలో ఆందోళన, అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.
కనుక కాపుల పేరుతో పద్మవ్యూహం రచించి దానిలోకి పవన్ కళ్యాణ్, జనసేన నేతలను లాగేందుకు వైసీపీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.
ఈవిషయం సిఎం చంద్రబాబు నాయుడు బాగానే పసిగట్టారు. కనుక డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్కి అండగా నిలబడుతూ వైసీపీపై ఎదురుదాడి చేస్తున్నారు. కానీ తాను ఒక్కడినే కాకుండా టీడీపి, జనసేన, బిజేపి మూడు పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా కలిసి కట్టుగా వైసీపీ సాగిస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలని పదేపదే సూచిస్తున్నారు.
ఆయన సూచన మేరకు టీడీపి మంత్రులు వైసీపీని ధీటుగా ఎదుర్కొంటున్నారు. కానీ బిజేపి, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలలో నిర్లిప్తత కనిపిస్తోంది.
ఇదే చంద్రబాబు నాయుడుని, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్కి ఆందోళన కలిగిస్తోంది. వైసీపీ ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంతో జనసేన, బిజేపి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభావితులై, దాని ఆటలో పావులుగా మారితే నష్టపోతామని పదేపదే హెచ్చరిస్తున్నారు.
కూటమి ఐఖ్యతని విచ్చినం చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని తెలిసి ఉన్నప్పటికీ ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారని సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ తమ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కూటమి ప్రభుత్వంలో కాపు సామాజికవర్గానికి ప్రతినిధిగా భావించబడుతున్న డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తనని కేవలం కాపుగా చూడవద్దని, కులాలకు అతీతంగా అందరం కలిసి పనిచేద్దామని పదేపదే చెపుతున్నారు. కానీ వైసీపీ ఆయనపై మరింత బలంగా ‘కాపు ముద్ర’ వేస్తూ ఆ సామాజికవర్గాన్ని ఆయనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది.
కనుక వైసీపీ అల్లిన ఈ ‘కాపు పద్మవ్యూహం’ని కూటమి ప్రభుత్వం చేధించడం చాలా అవసరం. లేకుంటే దానిలో అది అభిమన్యుడులా బలైపోయే ప్రమాదం ఉంది.




