సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల పోలింగ్లో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విదంగా డబ్బు, మద్యం పంచారు.
పలు జిల్లాలలో వైసీపి మూకలు రెచ్చిపోయి దాడులు చేశాయి. టిడిపి ఏజంట్లను తీవ్రంగా చితకొట్టారు. పుంగనూరులో కొందరిని కిడ్నాప్ చేశారు. అన్నమయ్య జిల్లాలోని కోడూరులో, ప్రకాశం జిల్లాలోని దర్శిలో, పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎంలను ధ్వంసం చేశారు.
కొంతమంది వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రాల వద్ద అనుచరులతో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు చెదరగొట్టి గృహనిర్బందంలో ఉంచారు.
తెనాలిలో వైసీపి ఎమ్మెల్యే శివకుమార్ పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఓటు వేయడానికి వచ్చిన ఓ వ్యక్తిపై తన అనుచరులతో కలిసి చితకొట్టారు.
రాయలసీమ జిల్లాలలో పలు ప్రాంతాలలో వైసీపి, టిడిపి కార్యకర్తల మద్య ఘర్షణలు జరిగాయి. అయినప్పటికీ రాష్ట్రంలో చెదురుముదురు ఘటనలు తప్ప పోలింగ్ ‘ప్రశాంతంగా జరిగిందని’ ఎన్నికల సంఘం సీఈవో ముఖేష్ కుమార్ మీనా చెప్పడం విశేషం.
పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారించేందుకు వేలాదిగా రాష్ట్ర పోలీసులను, కేంద్ర బలగాలను మోహరించామని, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని చెప్పుకున్నప్పుడు, ఇంత విధ్వంసం ఎందుకు జరిగింది?ఎందుకు అడ్డుకోలేకపోయారు?
పటిష్టమైన భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలలో ఉన్న ఈవీఎంలను ధ్వంసం చేయడం అంటే పోలింగ్ ప్రక్రియను అడ్డుకోవడమే కదా?దుండగులు పోలింగ్ కేంద్రాలలో జొరబడిఈవీఎంలను ధ్వంసం చేయగలిగారంటే అది ఎన్నికల సంఘం వైఫల్యం కాదా?
ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇంత విధ్వంసం జరిగినా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవడం హాస్యస్పదంగా లేదా?
ఈసారి ఎన్నికలలో వైసీపి పెట్రేగిపోతుందని మొదటి నుంచే అందరూ హెచ్చరిస్తున్నప్పటికీ ఎన్నికల సంఘం ‘తాంబూలాలు ఇచ్చేశాము తన్నుకు చావండి’ అన్నట్లు చాలా ఉదాసీనంగా వ్యవహరించిందని రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఈ విధ్వంసంపై కేంద్ర ఎన్నికల కమీషన్కు ఫిర్యాదు చేస్తామని టిడిపి, జనసేన నేతలు చెప్పారు.




