ఇంతకాలం డిఫెన్స్ ఆడిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు అటాక్ మోడ్లోకి వచ్చేసిన్నట్లే కనిపిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ నడుం విరగ కొడతానని చెప్పి మరీ అంతపనీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా రాష్ట్ర విద్యారంగంపై దృష్టి సారించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే పేద విద్యార్థులకు కూడా మిగిలినవారితో సమాన అవకాశాలు కల్పించడానికి అంటూ, జగన్ ప్రభుత్వం సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేసి ప్రవేశపెట్టిన ‘బైజూస్ ఆన్లైన్ పాఠాలు’ మళ్ళీ వాటి కోసం లక్షల ‘ట్యాబ్స్’ పంపిణీ గురించి ప్రశ్నిస్తూ ఘాటుగా ట్వీట్ చేశారు.
“ఓ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. ఉపాధ్యాయుల భర్తీ లేదు. కనీసం ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. వేలకోట్ల నష్టాలలో మునిగిపోయిన ఓ స్టార్టప్ కంపెనీ బైజూస్ సంస్థకు ఏవిదంగా కాంట్రాక్ అప్పగించారు? దానికి కాంట్రాక్ట్ అప్పగించడంలో వైసీపీ ప్రభుత్వం సక్రమంగా విధివిధానాలు పాటించిందా?ఈ కాంట్రాక్ట్ కోసం ఎన్ని కంపెనీలు టెండర్లు వేశాయి?వాటిలో ఎన్నిటిని షార్ట్-లిస్ట్ చేశారు?ఈ వివరాలన్నీ ఆన్లైన్లో పెట్టారా లేదా? వైసీపీ ప్రభుత్వం స్పందించాలి…” అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
దీనితో పాటు బైజూస్ కంపెనీ 2021 నవంబర్ నుంచి 2023 మే నెల వరకు ఏవిదంగా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొందో వివరిస్తూ ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ కూడా జత చేశారు.
చివరిగా “ట్యాబ్స్ మంచిదే కానీ వాటి కంటే ముందు పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ చాలా అవసరం. యాప్స్ ఐచ్ఛికం కానీ ఉపాధ్యాయులు తప్పనిసరి,” అంటూ జగన్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చురకలు వేశారు.
పాఠశాలలో మౌలిక వసతులు కల్పించకుండా, పాఠశాలల విలీనం చేసి, మాతృభాషలో విద్యాబోధనకు బదులు ఇంగ్లీష్ మీడియా ప్రవేశపెట్టి, దానికోసం బైజూస్, టోఫెల్ అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రయోగాలు చేస్తోంది. దీంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ సంగతేమో కానీ విద్యార్థుల డ్రాప్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది క్రమంగా పెరుగుతోంది. వార్షిక పరీక్షలలో సరైన ఫలితాలు కూడా సాధించలేకపోతున్నారు. ఈ ప్రయోగాలతో ఒక తరం విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.



