ఏపీలో సజావుగా ఎన్నికల తంతు పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు. పలు ప్రాంతాలలో వైసీపీ, టీడీపీ పోలింగ్ ఏజంట్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలక్కొంది.
ముఖ్యంగా పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి నియోజకవర్గమైన పుంగనూరు లో వైసీపీ కార్యకర్తలు టీడీపీ పోలింగ్ ఏజెంట్ల మీద కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేస్తున్న వీడియో లు మీడియాలో దర్శనమిస్తున్నాయి. బూత్ ఏజంట్లుగా టీడీపీ తరుపున బాధ్యతలు వహిస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తుల పై దాడి చేస్తూ వారిని పోలింగ్ స్టేషన్లకు రాకుండా అడ్డుకుంటున్నారు వైసీపీ మూకలు.
ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తల తలలు పగిలాయి. అలాగే పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ముగ్గురు టీడీపీ పోలింగ్ ఏజంట్లకు గాయాలవ్వగా అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అలాగే కడప జిల్లాలో కమలాపురం మండలం కొగట్టం లోను ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా వైసీపీ కార్యకర్తలు టీడీపీ వారి పై దాడికి పాల్పడడంతో ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్లకు రావడానికి కూడా భయపడుతున్నారు ఓటర్లు.
పోలింగ్ మొదలు పెట్టిన ఈ కొద్దిపాటి సమయంలోనే ఈ స్థాయిలో దాడులు జరగడం, తలలు పగలడం, రక్తాలు చిందడం అంటే ఇది పోలింగ్ చివరి నిముషంలో మరెన్ని దారుణాలు జరగనున్నాయో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏపీ ఓటర్లు. ఒక పక్క పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఇలా ఘర్షణ వాతావరణం సృష్టించడం అప్రజాస్వామ్యమే అవుతుంది.




