ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరాల సేకరణతో ఆరంభమైన ‘ప్రజా సాధికారిక సర్వే’కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సర్వే వివరాలు నమోదు చేయాల్సిన ట్యాబ్ లతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా సిబ్బంది చెప్తున్నారు. ట్యాబ్ లలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలతో సమాచార సేకరణ అరకొరగానే మారింది.
దాదాపు 23 వేల బృందాలు ట్యాబ్ లతో సర్వేకు దిగితే, ఇప్పటివరకు కేవలం 716 కుటుంబాల సమాచార సేకరణ మాత్రమే పూర్తి కావడం గమనించదగ్గ విషయం. సిబ్బందికి ట్యాబ్ లపై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం ఒక కారణమైతే, నెట్ వర్క్ సమస్యలు కూడా ప్రధాన అడ్డంకిగా మారిందని అధికారులు తెలుపుతున్నారు. తదుపరి రెండు మూడు రోజుల్లో ఈ సమస్యలు సద్దుమణుగుతాయని భావిస్తున్నట్టు వివరించారు.
కాగా, సెలవు రోజైన ఆదివారం కూడా ఈ ‘ప్రజా సాధికారిక సర్వే’ కొనసాగించాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం రోజు అందరూ ఇళ్ల వద్ద ఉంటారు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఒక్కో కుటుంబం సమాచార సేకరణకు దాదాపు ఒక గంట సమయం పడుతోందని, అలా ఒక బృందం రోజుకు 10 కుటుంబాల సర్వే కన్నా మించి చేయలేకపోతున్నారని అంటున్నారు.



