ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా పయనిస్తే… ఇతర రాష్ట్రాలకు ముప్పు వాటిల్లుతుంది..! సరిగ్గా ఇవే మాటలు కాకపోయినా, పొరుగున ఉన్న తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాలు ఇలానే వ్యవహరిస్తున్నాయి, కేంద్రంలో ఉన్న బిజెపి వీటికి వంత పాడుతోంది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి తమిళనాడు అభ్యంతరాలు చెప్తోందని తొలినాళ్ళల్లో కేంద్రం తెలుపగా, ప్రస్తుతం తెలంగాణా అయితే తమకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది, అది కూడా ఏపీకి ఇస్తేనే తమకు కావాలని!
ఆ మాటలు అనడానికి రాజకీయ నేతలకు నోరెలా వస్తుందో గానీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు ఇవ్వాలని టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేయడం విస్తుపోయే అంశం. వీరి డిమాండ్ వెనుక ఉన్న లాజిక్ ఏమిటంటే… ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలన్నీ ఏపీకి తరలిపోతాయి గనుక, తమ పరిస్థితి ఏం కాను? అన్న రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. అంటే పరోక్షంగా ఏపీ అభివృద్ధి తమకు చేటు అన్న విషయాన్ని చెప్పకనే చెప్తున్నారు మంత్రి వర్యులు.
రాష్ట్రాలు ఇలా వ్యవహరిస్తుంటే… న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న కేంద్ర మంత్రులు చేస్తోన్న ప్రకటనలకైతే లెక్కా,జాము లేదు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరంకు 6700 కోట్లు ఇచ్చేసామని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు గొప్పగా రాజ్యసభలో ప్రస్తావించడం వారి ఆలోచనలకు అద్దం పడుతోంది. ఇటు పోలవరం పూర్తి చేయక, అటు స్పెషల్ స్టేటస్ ఇవ్వక… చంద్రబాబు వర్షన్ లో చెప్పాలంటే ఏపీని అణగద్రొక్కే ప్రక్రియను విజయవంతంగా కేంద్రం అమలు చేస్తోందని చెప్పాలి. దానికి రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేతలు కూడా సహకారం అందించడం మరో హైలైట్!



