ముంజేతి కంకణం చూసుకొనేందుకు అద్దం ఎందుకు?అన్నట్లు ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి మళ్ళీ ఎవరో ప్రజలకు చెప్పాలా?రామాయణ మహాభారత భాగవత గాధలను ఎన్నిసార్లువిన్నా మళ్ళీ మళ్ళీ వింటున్నట్లే ఏపీ ఆర్ధిక పరిస్థితి, అప్పుల గురించి ఎవరి నోటనో వింటూనే ఉంటాము.
కొన్ని రోజుల క్రితమే ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గడగడా ఈ లెక్కలన్నీ వినిపించి, కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేలకోట్లు ఇస్తున్నా, జగన్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేస్తూనే ఉందని, అయినా ఏపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుందని తేల్చి చెప్పేశారు. అందుకు వైసీపీలో ఎవరూ ఆవేశపడిపోలేదు. వినబడన్నట్లు అందరూ ఊరుకొన్నారు.
తెలంగాణ ఎంపీ నామా నాగేశ్వరరావు ఏపీ, తెలంగాణ అప్పుల గురించి లోక్సభలో ప్రశ్నించడంతో ఈసారి ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ స్వయంగా ఆ లెక్కలు బయటపెట్టారు.
ఈ ఏడాది మార్చి నాటికి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం అప్పు రూ.3,66,306 కోట్లు ఉండగా ఏపీ అప్పులు రూ.4,42,442 కోట్లు ఉందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులతో ఆ రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసుకొంది. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ పేరుతో తెచ్చుకొన్న రూ.6,528.95 కోట్ల అప్పుతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో పెండింగ్ పనులను పూర్తి చేసుకొంది.
అలాగే గ్రామీణ అభివృద్ధి నిధి నుంచి తెచ్చుకొన్న రూ.4,263 కోట్లతో గ్రామాలలో మౌలిక వసతులు కల్పించుకొంది. త్రాగునీటి సరఫరా కార్పొరేషన్ పేరుతో తెచ్చుకొన్న రూ.1,407.97 కోట్లతో హైదరాబాద్ నగరానికి కృష్ణా, గోదావరి జలాలను తరలించేందుకు అవసరమైన కాలువలు, రిజర్వాయర్లు నిర్మించుకొంది. అంటే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులు మౌలిక సదుపాయాల కల్పనా కోసమే చేసిన అప్పులను వినియోగించుకొంటోందని స్పష్టం అవుతోంది.
ఈ నాలుగేళ్ళలో ఏపీ ప్రభుత్వం అధికారికంగా, అనధికారికంగా కలిపి మొత్తం రూ.7,14,631 కోట్లు అప్పులు చేసిందని దగ్గుబాటి పురందేశ్వరి బయటపెట్టారు. దగ్గుబాటి పురందేశ్వరి విమర్శలకు మంత్రులెవరూ సమాధానం చెప్పలేదు. కానీ ఇదేమాట టిడిపి నేతలో లేదా పవన్ కళ్యాణ్ గానీ అడిగితే వారిపై మూకుమ్మడిగా అందరూ విరుచుకుపడిపోతుంటారు. బహుశః అత్తమీద కోపం దుత్త మీద చూపడం అంటే ఇదేనేమో?
ఈ నాలుగేళ్ళలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అప్పులు ఏవిదంగా పెరిగాయో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా లోక్సభలో చెప్పిన వివరాలు:




