కేంద్రం అవార్డులు ఇవ్వకపోతేనేం… మాకు మేమే ఇచ్చుకోలేమా?

Panchayat-Telangana-Award-winners-2023ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి శాఖ దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి వివిద విభాగాలలో అవార్డులు, నగదు బహుమతులు అందజేసింది. మొత్తం 46 అవార్డులు ప్రకటించగా వాటిలో 13 అవార్డులను తెలంగాణా రాష్ట్రమే గెలుచుకొంది. వాటితో పాటు రూ.12.50 కోట్లు నగదు పురస్కారం కూడా తెలంగాణ గ్రామ పంచాయతీలు అందుకొన్నాయి. అయితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వాటిలో ఒక్క అవార్డు కూడా లభించలేదు!

ADVERTISEMENT

కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వకపోతేనేం… మాకు మేమే ఇచ్చుకోలేమా?అంటూ నేడు జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వమే 26 జిల్లాలలో 27 పంచాయితీలను ఎంపిక చేసి వార్డులు ఇచ్చుకొంటోంది. గమ్మతైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆవార్డులు ప్రకటించిందో ఏపీ ప్రభుత్వం కూడా వాటినే పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులు అందించబోతోంది. పేదరిక నిర్మూలన, జల సమృద్ధి, స్వయంసమృద్ధి, సామాజిక భద్రత, విమెన్ ఫ్రెండ్లీ, గుడ్ గవర్నెస్, హెల్తీ పంచాయితీ, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయితీ అవార్డులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ కార్యాలయంలో ప్రధానం చేయబోతోంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అవార్డులకు అర్హమైన ఇన్ని అత్యుతమైన పంచాయతీలు ఉంటే మరి జాతీయ అవార్డులు ఎందుకు రాలేదు?సిఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దలపట్ల విధేయంగా వ్యవహరిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూస్తూ, మోడీ ఫోటోలతో ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి మరీ విమర్శిస్తుంటారు. అయినా తెలంగాణలో పంచాయితీలకు 13 అవార్డులు లభించగా, ఏపీలో ఒక్క పంచాయితీకి అవార్డు రాలేదు!అంటే తెలంగాణలో నిజమైన అభివృద్ధి జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కానీ ఏపీలో జరగడం లేదనే కదా?ఒకవేళ జరిగి ఉంటే ఏపీకి కూడా జాతీయ అవార్డులు ఇచ్చి ఉండేది కదా?

తెలంగాణ రాష్ట్రంలో పట్టణ సచివాలయాలు లేవు… గ్రామ సచివాలయాలు కూడా లేవు. కానీ ఆ రాష్ట్రంలో గ్రామస్థాయి వరకు కళ్ళకు కనబడేంతగా అభివృద్ధి సాధిస్తున్నాయి. కానీ దేశంలో మరెవరికీ తట్టని మూడు రాజధానులు, పట్టణ, గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వంటి గొప్ప గొప్ప ఐడియాలన్నీ వైసీపీకే తడుతుంటాయి. వాటితో పరిపాలనా వికేంద్రీకరణ చేసి ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చేశామని వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది.

గ్రామాలలోనే సచివాలయాలు ఏర్పాటు చేసినప్పుడు మరి ఏపీలో గ్రామాలన్నీ అభివృద్ధి చెందే ఉండాలి కదా?కానీ ఏపీలో ఒక్క గ్రామానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ఒక్క అవార్డు కూడా ఎందుకు రాలేదు?అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకొంటే మన పరువేపోతుంది. కనుక కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వకపోతేనేం… మాకు మేమే ఇచ్చుకోలేమా?అంటూ ‘వీరతాళ్ళు’ వేసేసుకొంటోంది. శభాష్ శభాష్…. ఇదీ ఓ గొప్ప ఐడియాయే కనుక దీనికి మరో వీరతాడు వేసుకోవలసిందే!

ADVERTISEMENT
Latest Stories