ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు జీతాలు పెంచాలని కోరుతూ గత 27 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే, జగన్ ప్రభుత్వం వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి, జీతాలు కోసి మిగిలిన జీతాన్ని చేతిలో పెట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు ఉదృతం చేశారు. తమపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగిస్తే భయపడబోమని, సమ్మెని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
జీతాలు పెంచమని తాము అడుగుతుంటే, జీతాలు కోసి చేతిలో పెట్టడం తమని అవమానించడమే, రెచ్చగొట్టడమే అని అన్నారు. ప్రభుత్వానికి ఏ సలహాలు ఇవ్వని సలహాదారులకి జగన్ వందల కోట్లు చెల్లిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో మహిళలు, పసిపిల్లల కోసం కష్టపడుతున్న తమకు జీతాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదని అన్నారు.
ప్రభుత్వ పధకాల కోసం ప్రకటనల కోసం చేసే ఖర్చుపాటి తమ జీతాలు ఉండవని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వృధా ఖర్చులు తగ్గించుకుంటే, తమకే కాదు… జీతాలు పెంచాలని సమ్మె చేస్తున్న పారిశుధ్య కార్మికులకు కూడా జీతాలు పెంచవచ్చని అన్నారు.
మరో మూడు నెలల్లో గద్దె దిగిపోబోతున్న జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇస్తోందని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమని ఉద్యోగాలలో నుంచి తొలగించడం కాదని తామే మరో మూడు నెలల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి అందరినీ ఇంటికి పంపిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు.
ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్:2 కాపీలను అంగన్వాడీ కార్యకర్తలు దహనం చేసి నిరసనలు వ్యక్తం చేశారు.
వారిపై జగన్ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని టిడిపి, జనసేన, వామపక్షాలు, కార్మిక, ఉపాధ్యాయ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు తప్పు పట్టాయి. వారు ఒంటరిగా పోరాడుతున్నామని భావించవద్దని తామందరం వారికి అండగా ఉన్నామని చెప్పాయి.
అంగన్వాడీ కార్యకర్తలందరూ మహిళలే. వారు సమాజంలో సాటి మహిళలు, వారి పిల్లలతో బలమైన సంబంధాలు కలిగి ఉంటారు. కనుక వారి పట్ల రాష్ట్రంలో మహిళలకు సానుభూతి ఉంటుంది. అంగన్వాడీ కార్యకర్తల కష్టాలను, కన్నీళ్ళని, వారి పట్ల జగన్ ప్రభుత్వం దురుసుగా వ్యవహరిస్తున్న తీరుని రాష్ట్రంలో మహిళలందరూ చూస్తూనే ఉన్నారు. కనుక అంగన్వాడీ కార్యకర్తల ఆవేదన, ఆక్రోశం ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి వినోదంగా కనిపించినా వారి ఉసురు, వారి శాపాలే వైసీపి పతనానికి కారణం కావచ్చు.




