తేజ ‘నువ్వు నేను’ సినిమాతో ఉదయ్ కిరణ్ సరసన తెరంగ్రేటం చేసిన అనిత, ఆ తర్వాత టాలీవుడ్ లో పలు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. మొదటి సినిమానే సిల్వర్ జూబ్లీ సినిమాగా మారినప్పటికీ, సరైన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైన అనిత, ఆ తర్వాత బాలీవుడ్ బుల్లితెరపై రాణిస్తోంది. అలాగే వివాహం చేసుకుని ఫ్యామిలీ జీవితాన్ని కూడా ఆస్వాదిస్తోంది.
మళ్ళీ చాలా కాలం తర్వాత ఆర్పీ పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “మనలో ఒకడు” సినిమా ద్వారా తెలుగు తెరపై దర్శనమివ్వబోతున్న అనిత, ఈ సినిమా ఆడియో సక్సెస్ సంబరాల్లో భాగంగా తిరుపతి విచ్చేసింది. ఈ సందర్భంగా సోమవారం నాడు ఈ ముద్దుగుమ్మ శ్రీకాళహస్తిలో సందడి చేసింది. కుటుంబ సభ్యలతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న అనిత రాహుకేతు పూజలు చేయించుకున్నారు.
స్వామి, అమ్మ వార్ల దర్శనం అనంతరం ఆలయ ఆవరణలోని పొగడ చెట్టు వద్ద ప్రదక్షిణలు చేశారు. ‘ఈ దేవస్థానంలో రాహుకేతు పూజలు చేయించుకుంటే సంతానం కలుగుతుందని స్నేహితులు చెప్పడంతో శ్రీకాళహస్తి వచ్చానని, ఆలయంలో శిల్ప సౌందర్యం అద్భుతంగా ఉందని’ చెప్పిన అనిత, తాను నటించిన ‘మనలో ఒకడు’ సినిమా విజయవంతం కావాలని శివపార్వతులను కోరుకున్నట్టుగా తెలిపారు.



