తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కువ మంది నటులున్న కుటుంబంగా మెగా ఫ్యామిలీ రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చిరు వేసిన వృక్షం అంతకంతకూ విస్తరిస్తుండగా, ఆ తర్వాత ఈ జాబితాలో నందమూరి, అక్కినేని కుటుంబాలు నిలుస్తాయి. అయితే తాజాగా ఇదే కోవలో ఘట్టమనేని ఫ్యామిలీ కూడా పయనిస్తుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ స్థాపించిన సామ్రాజ్యంలోకి తనయుడు రమేష్ బాబు అడుగుపెట్టినా, ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపలేదు గానీ, చిన్నతనంలోనే చిచ్చరపిడుగు వేషాలు వేసిన మహేష్ బాబు మాత్రం సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు.
దీంతో కృష్ణ తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వినిపించిన ఏకైక పేరు మహేష్. అయితే ఆ తర్వాత కృష్ణ తనయురాలు, మహేష్ సోదరి మంజుల కూడా సినీ విభాగంలో తన ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అలాగే మహేష్ బావ సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి, క్రమం తప్పకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే మెగా, నందమూరి కుటుంబాలతో పోలిస్తే… చాలా తక్కువ మంది ఆర్టిస్టులే ఉన్న మహేష్ ఫ్యామిలీ నుండి త్వరలో ఎంట్రీ ఇవ్వడానికి పలువురు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
రమేష్ బాబు తనయుడు జయకృష్ణ సినీ తెరంగ్రేటానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందని, త్వరలో భారీ స్థాయిలో జయకృష్ణ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. అలాగే మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ ఇప్పటికే “1 నేనొక్కడినే” ద్వారా వెండితెరపై కనిపించగా, తాజాగా అదే బాటలో మంజుల కుమార్తె జాహ్నవి కూడా పయనిస్తోందని, మంజుల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించే సినిమాలో తన కూతురికి ఓ కీలక పాత్ర ఇచ్చిందని ట్రేడ్ వర్గాల టాక్. అయితే మెగా కాంపౌండ్ మాదిరిగా అందరూ హీరోలుగా కాకుండా, ఇతర విభాగాల్లో కృష్ణ కుటుంబం పయనిస్తుండడం విశేషం.



