లోక్సభ ఎన్నికలలో ఎన్డీయే విజయం సాధించి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతుండటం ఖాయమని తెలియగానే పలు దేశాధినేతలు ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆయనకు అభినందనలు తెలియజేశారు.
కానీ పాకిస్తాన్ తెలుపలేదు. తెలుపకపోయినా పర్వాలేదు. కానీ ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ చెప్పిన మాటలు భారత్-పాక్ సంబంధాలను ఇంకా దెబ్బతీసేలా ఉన్నాయి.
ఆమె పాక్ మీడియాతో మాట్లాడుతూ, “భారత్ ప్రజలకు వారికి నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే స్వేచ్చ, హక్కు ఉన్నాయి. ఢిల్లీలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. కనుక అప్పుడే మేము అభినందనలు చెప్పడం తొందరపాటే అవుతుంది. భారత్లో ఎవరు అధికారం చేపట్టినప్పటికీ ఆ దేశంతో మేము స్నేహం, శాంతినే కోరుకుంటాము,” అని అన్నారు.
ఎన్డీయే, ఇండియా కూటములకు రెంటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది కనుక ఆమె ఆవిదంగా అని ఉండవచ్చని అనిపించవచ్చు. కానీ పదేళ్ళ క్రితం తొలిసారిగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే పాకిస్తాన్ ఆగడాలకు చెక్ పెట్టడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా కశ్మీరులో వేర్పాటువాదులను, వారికి మద్దతు ఇస్తూ, పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడుతూ రాజకీయాలు చేస్తున్న కశ్మీరీ నేతలను పూర్తిగా కట్టడి చేశారు. వారి ఆగడాలకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్ 377ని రద్దు చేశారు.
భారత్లో ఉగ్రవాదులను ఏరిపారేస్తూ, పాక్ ఉగ్రవాదానికి చెక్ పెట్టారు. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు భారత్, పాక్ సరిహద్దులలో పాక్ భూభాగంలోకి భారత్ వాయుసేనని పంపించి ఉగ్రవాదులపై దాడులు చేయించి పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టించారు.
పాకిస్తాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా దోషిగా నిలబెట్టగలిగారు. అందుకే పాకిస్తాన్ మోడీ ప్రధాని కావాలని కోరుకోదు. కానీ ఆయనే మళ్ళీ ప్రధాని అవుతుండటంతో పాకిస్తాన్ జీర్ణించుకోవడం కష్టమే. అందుకే పాకిస్తాన్ పట్ల వల్లమాలిన అభిమానం చూపే కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, రావాలని కోరుకుంటున్నట్లు భావించవచ్చు. రాహుల్ గాంధీ లేదా మరొకరు ప్రధాని కావాలని పాకిస్తాన్ కోరుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
కేసీఆర్ కూడా మోడీ ప్రధాని కాకూడదనే కోరుకున్నారు. కేవలం 12 ఎంపీ సీట్లు వస్తే ఢిల్లీలో తానే చక్రం తిప్పాలని దురాశ పడ్డారు. ఏపీలో చంద్రబాబు నాయుడు రాకూడదని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని, కావాలని కోరుకున్నారు.
కానీ కేసీఆర్ లేదా పాకిస్తాన్ కోరుకున్నట్లు అన్నీ జరుగవు. ప్రజలు ఎవరిని కోరుకుంటే వారే ప్రధాని, ముఖ్యమంత్రులు అవుతారని తాజా రాజకీయ పరిణామాలు నిరూపించి చూపుతున్నాయి.




