త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు స్థానిక సమరానికి సిద్దమవుతున్న తరుణంలో అధికార పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంచాయితీ మూడు పార్టీల అధినేతలకు పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం లేకపోలేదు.
కూటమి పొత్తులో కీలక పార్టీగా ఉన్న టీడీపీ క్షేత్ర స్థాయిలో రాజకీయ బలమున్న అతిపెద్ద పార్టీ. ఆ పార్టీ తరుపున టికెట్లు ఆశించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే పొత్తులో భాగంగా సీట్లు త్యాగాలు చేసిన టీడీపీ నాయకులు కనీసం తమకు స్థానిక సంస్థల ఎన్నికలలో అయినా పెద్ద పీట వేయాలంటూ అధినేత వద్ద పెద్ద ఎత్తున విన్నపాలు చేస్తారు.
ఇక జనసేన విషయానికొస్తే రాష్ట్ర భవిష్యత్ కోసం సార్వత్రిక ఎన్నికలలో తమ బలాన్ని కుదించుకున్నాం కానీ ఇప్పుడు తగ్గేదెలా అంటూ తమకు పట్టున్న స్థానాలలో పోటీ తప్పదు అంటూ జనసేన అందుకు తగ్గట్టుగా ప్రకటనలు చేస్తుంది. ఇక బీజేపీ కూడా పొత్తులోనే తన పార్టీ బలం పెంచుకోవాలని ఆశపడుతోంది.
ఇలా మూడు పార్టీలకు ఆశావహుల సంఖ్య బారెడంత ఉంటే ఇక్కడ సీట్ల కేటాయింపు సర్దుబాట్లు, వాటితో మూడు పార్టీల లీడర్ల తో పాటుగా క్యాడర్ ను సంతృప్తి పరచడం మూడు పార్టీల అధిష్టానాలకు తలకు మించిన భారమే అవుతుంది.
ఒకపక్క స్థానిక ఎన్నికలలో తమ సత్తా నిరూపించి వైసీపీ 2.0 ఆశలకు జీవం పోయడానికి జగన్ పార్టీ లీడర్లకు, క్యాడర్ కు యుద్ధం చేయాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. ఇటువంటి తరుణంలో కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో ఆచితూచి ముందుకెళ్లాలి, అలాగే తమ నిర్ణయాలతో మూడు పార్టీల క్యాడర్లను మెప్పించాలి.లేకుంటే నాడు మూడు పార్టీలకు బలమైన ఈ పొత్తులే నేడు బలిహీనం అవుతాయి అనేది గ్రహించాలి.





