పురందేశ్వరి విమర్శలు సరిగా లేవట!

Daggubati Purandeswariదగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ఇచ్చిన పద్దు పుస్తకాలు ముందుంచుకొని మరీ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు కేంద్ర ప్రభుత్వం ఎంతెంత ఇచ్చిందో అణాపైసలతో సహా లెక్కలు చెప్పి, లక్ష కోట్లకుపైగా ఇచ్చినా జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుందన్నారు.

చంద్రబాబు నాయుడో, పవన్‌ కళ్యాణో చిన్న మాటంటే మూకుమ్మడిగా ఎదురుదాడి చేసే మంత్రులందరూ పురందేశ్వరి తమ ప్రభుత్వం ఇన్ని విమర్శలు, ఆరోపణలు చేసినప్పటికీ ఎవరూ కిక్కురుమనలేదు. ఇటువంటప్పుడే అక్కరకు వస్తుంది ఆత్మసాక్షి!

ADVERTISEMENT

వైసీపీ అధినేత స్వయంగా చెప్పలేని ఆయన మనసులో మాటలను, ఆవేశాన్ని ఆత్మసాక్షి చెపుతుంటుంది. అది కూడా చాలా ఆచితూచి!

ఈరోజు సంచికలో ‘ఆమె మాటలు టిడిపికే ఫాయిదా… వివేకా కేసులో లాజిక్ మిస్ అయినట్లుందే’ అనే హెడ్డింగ్ పెట్టి దగ్గుబాటి పురందేశ్వరి ఫోటో వేసి ‘ఈనాడు చదవడం ఆపితే బెటర్’ అని సూచిస్తూ, ఆమెపై బాణాలు వేసింది.

ఆమె ఈనాడు పేపర్ చదివి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలనే చిలకలా వల్లెవేశారని, బహుశః ఆమె కూడా టిడిపితో పొత్తు పెట్టుకోవాలని కోరుకొంటున్నట్లున్నారని చెప్పింది. ఆమె టిడిపిని విమర్శించి ఉంటే ప్రజలలో ఆమెకు గౌరవం పెరిగి ఉండేదని ఆమె ఏమి చేయాలో సూచించింది.

ఒకవేళ ఏపీలో టిడిపి దెబ్బ తింటే రాష్ట్రంలో కమ్మ ఓటర్లను, ఎన్టీఆర్‌ అభిమానులను ఆకర్షించేందుకే బిజెపి అధిష్టానం ఆమెను రంగంలో దింపిందని కనిపెట్టి చెప్పింది.

వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐ తేల్చలేకపోతుంటే అది కేంద్రం వైఫల్యమే అవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వంది కాదు కదా? మరి ఇంత చిన్న లాజిక్ ఆమె ఎలా మిస్ అయ్యారో? అని ఆశ్చర్యపోయింది.

ఏపీలో ఒకటి రెండు ఘటనలు పట్టుకొని అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, శాంతిభద్రతలు సరిగా లేవని ఆరోపించడం చవుకబారు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నట్లుంది తప్ప ఆమె స్థాయికి తగ్గట్లు లేవని గుర్తు చేసింది.

ముఖేష్ అంబానీ అంతటివాడు సిఎం జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చొని ఏపీలో పెట్టుబడులు పెడతానంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని ఆమె ఆరోపించడం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడింది.

మొత్తం మీద ఆమె వైసీపీ కోరుకొన్నట్లు మాట్లాడలేదని, వైసీపీ కళ్ళద్దాలు పెట్టుకొని సాక్షి పేపర్ చదివి ఆ లెక్కన రాజకీయాలు చేస్తే బాగుంటుందని తేల్చి చెప్పింది.

వైసీపీలో అందరూ తాను చెప్పిన్నట్లే మసులుకోవాలని జగన్‌ కోరుకోవడంలో తప్పులేదు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎవరితో పొత్తులు పెట్టుకోకూడదని, తాము కోరుకొన్నట్లే మసులుకోవాలని కోరుకోవడమే విడ్డూరంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని కూడా ఆ జాబితాలో చేర్చి నిర్మాణాత్మకంగా అంటే ‘వైసీపీ కోరుకొంటున్నట్లు’ మసులుకోవాలని హితవు చెపుతోంది. మరి దగ్గుబాటి పురందేశ్వరి ఏమంటారో?

ADVERTISEMENT
Latest Stories