వైస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆడవారిని అడ్డుపెట్టుకునో…లేక ఆడవారిని అవమానించో…రాజకీయాలు చేయడంలో సిద్దహస్తుడనే చెప్పాలి. పార్టీ పెట్టిన కొత్తలో అసలు రాజకీయం అంటే అర్ధం కూడా తెలియని ఒక సామాన్య గృహిణిగా ఉండే వైస్సార్ భార్య వైస్ విజయలక్ష్మిని రాజకీయ తెర మీదకు తీసుకువచ్చారు.
అక్కడితో తనకు రావాల్సినంత రాజకీయ మైలేజ్ రావడం లేదు అని భావించి చెల్లి షర్మిలను కూడా రాజకీయ రంగ ప్రవేశం చేపించారు. ఇలా తల్లిని చెల్లిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రజలలో తండ్రి లేని పిల్లాడు…ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ సానుభూతి కబుర్లు చెప్పి అధికారం దక్కించుకున్నారు.
ఆతరువాత అదే తల్లిని, చెల్లిని రాష్ట్రం సరిహద్దు దాటించి ఇక ఏపీ రాజకీయాలతో తెగతెంపులు చేసి వారి ఇరువురిని అవమానించారు. అలాగే 2019 ఎన్నికలకు ముందు వివేకా హత్య ఘటనను అడ్డుపెట్టుకుని నా చెల్లికి తండ్రి దూరం చేసారు..మా చిన్నమ్మకు పసుపుకుంకుమ లేకుండా చేసారు అంటూ సునీత ను ఒక పక్క చిన్నమ్మ సౌభాగ్యం ను మరో పక్క పెట్టుకుని ప్రజలకు కళ్ళబుల్లి కబుర్లు వినిపించారు.
ఒక్కసారి అధికారం చేచిక్కగానే తండ్రిని చంపిన కిరాతకురాలు సునీత అంటూ చెల్లిపైనే నేరారోపణలు చేసి సునీత కుటుంబం మొత్తాన్ని అవమానించారు జగన్. ఇక అసలు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ప్రతిపక్ష నాయకుల భార్యల గురించి అసెంబ్లీ లో నీచమైన విమర్శలు చేపించడం…బహిరంగ సభలలో తానే స్వయంగా వారి భార్యల గురించి ప్రస్తావన తీసుకురావడం వారిని బజారుకు లాగడం జగన్ దినచర్యలో భాగంగా తయారయ్యింది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.
ఇలా ఆడవారితో ఆడే రాజకీయ క్రీడలో జగన్ ఆరితేరారిపోయారు. అయితే వై నాట్ 175 అంటూ నినాదాలు చేస్తున్న జగన్ అటు బాబు పోటీ చేసే కుప్పం..లోకేష్ పోటీ చేసే మంగళగిరి..పవన్ పోటీ చేసే పిఠాపురం..బాలకృష్ణ పోటీ చేసే హిందూపుర్ నియోజకవర్గాలలో ఒక ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఇందులో బాబు పోటీ చేయబోయే కుప్పం మినహాయిస్తే మిగిలిన మూడు స్థానాలలో వైసీపీ తరుపున మహిళా అభ్యర్థులను బరిలో దింపబోతున్నారు.
మంగళగిరి నుండి లోకేష్ పై మురుగుడు లావణ్య…హిందూపురం నుండి బాలకృష్ణ పై దీపికా …పిఠాపురం నుండి పవన్ పై వంగా గీత…ఇలా మూడు కీలకమైన స్థానాలలోను ముగ్గురు మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపారు జగన్. అయితే దీని వెనుక జగన్ వ్యూహం పెద్దదే. అయితే ఈ మూడు స్థానాలలో టీడీపీ కూటమి చాల బలంగా ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్, పవన్, బాలకృష్ణ లు విజయఢంకా మోగించడం ఖాయంగా కనపడుతుంది.
కాబట్టి ఇటువంటి స్థానాలలో మహిళా అభ్యర్థులను నిలబెడితే వారు ఓడిపోయినా వైసీపీ పెద్దగా నష్టం రాకపోవచ్చు. అలాగే తమ ప్రత్యర్థి మహిళ కావడంతో లోకేష్, పవన్ లు ఆమె పై దూకుడుగా విమర్శలు చేయడానికి వెనుకాడే అవకాశం ఉంటుంది. దీనితో స్థానిక పోటీ అభ్యర్థి పై అనుకున్నంత వ్యతిరేకతను తీసుకురాలేకపోవచ్చు. ఇవన్నీ లోకేష్, పవన్, బాలకృష్ణ గెలుపుని అడ్డుకోలేకపోయే అంశాలే అయినప్పటికీ ప్రత్యర్థికి అది ఇంతో అంతో కలిసి వచ్చే అంశమే.
అలాగే వైసీపీ అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ ఒక మహిళ మీద పోటీ చేసి గెలిచావ్ అది ఒక గెలుపేనా..? అంటూ వీరి గెలుపుని తక్కువచేసి చూపే అవకాశం కూడా జగన్ తన చేతుల్లోనే పెట్టుకున్నారు. ఒక వేళ ఏదైనా అద్భుతం జరిగి కూటమిలో ఏ ఒక్కరు ఓడినా చివరకు ఒక మహిళ చేతులో కూడా ఓడిపోయావు…నువ్వు రాజకీయాలకే పనికిరావు అంటూ అవహేళన చేసి వ్యక్తత్వహననం చేయడానికి కాసుకొని కూర్చుంటారు వైకాపా నాయకులు.
తమ ప్రత్యర్థిని కించపర్చడానికి, వారి విజయ గర్వాన్ని తగ్గించడానికి వైసీపీ తరుపున మహిళా అభ్యర్థులను పోటీలో ఉంచి అటు ప్రత్యర్థులతో పాటుగా ఇటు ఆడవారిని కూడా అవమానించడానికి గట్టి ప్లానే వేశారు వైసీపీ పెద్దలు. లోకేష్ పోటీ చేయబోయే మంగళగిరి స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆర్కేను కాదని టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి స్థానిక ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన జగన్ ఆ తరువాత ఆయన నుండి కూడా పగ్గాలు లాక్కుకుని రాజకీయాలలో మొదటిసారి పోటీ చేయబోతున్న లావణ్యకు అవకాశం కల్పించారు.
ఇలా రాజకీయంగా అనుభవం ఉన్న వారిని కాకుండా ఒక జూనియర్ ను తీసుకువచ్చి లోకేష్ కు వ్యతిరేకంగా బరిలోకి దింపడానికి సిద్ధపడ్డారు అంటేనే అర్ధమవుతుంది జగన్ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న గూడార్థం. అలాగే పవన్ పైన కూడా అదే సామజిక వర్గానికి చెందిన కుల పెద్దగా చెప్పుకోబడుతున్న ముద్రగడను బరిలోకి దింపుతారు అంటూ ఊహాగానాలు వచ్చినా ఆయను పక్కన పెట్టిమరీ ఎంపీ గా ఉన్న వంగ గీతను తెచ్చి పిఠాపురం ఎమ్మెల్యే గా బరిలోకి దింపారు.
ఇప్పటికే ముద్రగడ మీద తీవ్ర వ్యతిరేకతతో ఉంది ఆయన సామాజికవర్గం. కాపు రిజర్వేషన్ ఇస్తాను అన్న వ్యక్తి మీద తిరుగుబాటు చేసి అసలు కాపులకు రిజర్వేషన్ ఎందుకు అన్న వ్యక్తితో చేతులుకలిపి మళ్ళీ కుల పెద్ద అనే టాగ్ లు ఎందుకండీ అంటూ ముద్రగడకు వైసీపీ ముద్ర వేసేసారు కాపు సోదరులు. ఈ నేపథ్యంలో వంగ గీత మీదే ఆశలు పెట్టుకున్నారు వైసీపీ నేతలు.
ఇక హిందూపూర్ విషయానికి వస్తే గతంలో బాలకృష్ణ మీద పోటీ చేసి ఓడిపోయినా షైక్ మహమ్మద్ ఇక్బాల్ ను పక్కన పెట్టి దీపికను తెర ముందుకు తెచ్చారు. ఇలా ఆడవారితో రాజకీయం…! గెలిస్తే కొండంత..ఓడితే గోరంత..! క్యా ఐడియా సారూ..! అంటూ జగన్ రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టే పనిలో ఉన్నారు కూటమి సైన్యం. ఇది 2019 కాదు 2024 ఇక మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరనేది వైసీపీ గ్రహిస్తే ఇటువంటి రాజకీయ క్రీడలలో మహిళా నేతలు బలి కాకుండా ఉంటారు.






