భిమిలీ సభా వేదిక సాక్షిగా ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాం అంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తనను తానూ పొగుడుకుంటూ, ప్రతిపక్షాలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
ఆ వ్యాఖ్యలకు ఎవరికీ తగ్గ రీతిలో వారు కౌంటర్లు వేస్తూ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. “నేను ప్రతిపక్షాలు వేసే పద్మ వ్యూహం లో చిక్కుకోవడానికి అభిమన్యుడిని కాదు అర్జునుడిని” అంటూ తనకు తానే ఒక జాకీ వేసుకున్నారు జగన్. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు జగన్ ముందుకొచ్చాయి.
అర్జునుడు ఎప్పుడు ఆడవారి పై రాజకీయ విమర్శలు చేసి రాజకీయ లబ్ది పొందాలని ఆశించలేదు కదా..? అలాగే తమను నమ్మి వచ్చిన ప్రజల కోసం పాండవులు ఒక కొత్త నగరాన్నే నిర్మించారు. కానీ జగన్ తనను, తన పార్టీని నమ్మి ఓటేసిన ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా చేసి ఒక నగరాన్నే కూల్చేశారు.
కృష్ణుడిలా నాకు ప్రజలు, కార్యకర్తలు అండగా ఉన్నారు అంటున్న జగన్, మరి ఆ కృష్ణులను కలవడానికి పరదాలు ఎందుకు కట్టుకుంటున్నారో చెప్పగలరా..? వారి పార్టీ కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో ఎందుకు ఉండరో..? సొంత చెల్లి పై తన పాండవ సైన్యం తో దిగజారుడు విమర్శలకు ఎందుకు పాల్పడుతున్నారో..? చెప్పగలరా..!
అన్న ధర్మరాజు మాటకు కట్టుబడి సర్వ రాజభోగాలను వదులుకున్నాడు ఆ అర్జునుడు. కానీ సొంత చెల్లికి, తల్లికి తన రాజ్యంలో స్థానం కూడా ఇవ్వకుండా పక్క రాష్ట్రానికి పంపారు ఈ అర్జునుడు. తన తండ్రి సోదరుడి కోసం తన ప్రాణాలను కూడా బలిఇవ్వడనికి సిద్ధపడ్డాడు పాండవులలో ఒకరైన భీముడు. కానీ తన సొంత బాబాయ్ ని హత్య చేసిన వారిని గడిచిన నాలుగున్నరేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారు ఈ అర్జునుడు.
ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లారు ఆనాటి పాండవులు. ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చలేదు అని అడిగిన పాపానికి ప్రతిపక్ష నేతలను జైలుకు పంపుతున్నారు ఈ నాటి అర్జునుడు. ఇంతకీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి పురాణాల చరిత్ర తెలిసే ఈ పోలిక తీసుకున్నారా..? లేక ఇది కూడా సలహాదారుల స్క్రిప్ట్ పేపర్ ఆధారంగా చదువుకుంటూ వెళ్లిపోయారా..? అనే సందేహాలు ప్రజలలో మొదలయ్యాయి.
రాజులు రాజరికాలు, యుద్దాలు పోయి చాలాకాలం గడిచినా జగన్ ఇంకా తాను ఒక రాజు అనే భావనలో నుంచి బయటకు రాలేకపోతున్నారు అంటూ, జగన్ అర్జునుడు కాదు జరగబోయేది కురుక్షేత్రం కాదు. జరగబోయేది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ప్రజాస్వామ్య ఎన్నికలు మాత్రమే అని ఇప్పటికైనా గ్రహించాలి అంటూ ప్రజాస్వామ్య వాదులు హితవు పలుకుతున్నారు.




