ఊహించిన్నట్లే జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో చివరి సభను పిఠాపురంలోనే ముగించారు. పవన్ కళ్యాణ్ని ఓడించాలని ఆయన ఎంత కసితో రగిలిపోతున్నారో అర్దం చేసుకోవడానికి ఇదే నిదర్శనం.
ఎప్పటిలాగే పిఠాపురంలో కూడా జగన్ మళ్ళీ ‘దత్తపుత్రుడు-పెళ్ళాలు మార్చుతారు’ అంటూ చాలా అవహేళనగా మాట్లాడారు. ఆ సమయంలో పక్కనే మహిళా అభ్యర్ధి వంగ గీత కూడా ఉన్నారనే విషయం జగన్ పట్టించుకోలేదు.
పవన్ కళ్యాణ్-పెళ్ళాల గురించి ప్రస్తావిస్తూ “ఇలాంటి వ్యక్తిని మహిళలు నమ్మగలరా?”అని జగన్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్యలు ఇద్దరూ ఏనాడూ మీడియా ముందుకు వచ్చి ఆయనను విమర్శించలేదు. రేణుకా దేశాయ్ నేటికీ పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవం అని చెపుతుంటారు కూడా. పవన్ కళ్యాణ్ కుటుంబం నుంచి విడిపోయినవారు కూడా ఆయనను ఇంతగా గౌరవిస్తున్నారు. ఆయనకు సినీ పరిశ్రమలో, మెగా ఫ్యామిలీలో ప్రతీ ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు.
కానీ జగన్ వెంట తల్లి, చెల్లి ఎవరైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి హత్యారాజకీయాలు చేస్తున్నారని సొంత చెల్లి వైఎస్ షర్మిల, మరో చెల్లి సునీత ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పుకున్నారు. వైసీపి కాలాకేయ సైన్యం తమని వేధిస్తోందని చెప్పుకొని ఇద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. చివరికి తల్లి విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డిని వద్దనుకుని కూతురు వైఎస్ షర్మిలనే గెలిపించమని కోరారు.
జగన్ కూడా తన చెల్లి గురించి అనుచితంగా మాట్లాడుతూనే ఉన్నారు. జగన్ తన తల్లిని, చెల్లినే గౌరవించడం లేదు. వారు కూడా ఆయనను వద్దనుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళనే గౌరవించి, గౌరవం పొందలేకపోతున్న జగన్, పవన్ కళ్యాణ్ని దెబ్బ తీసేందుకు ‘మూడు పెళ్ళాలు, కడుపులు…’ అంటూ మహిళలను కించపరుస్తున్నట్లు మాట్లాడుతున్నారు. మళ్ళీ అదే నోటితో నీతులు కూడా వల్లిస్తున్నారు.
తనను వ్యతిరేకించే ప్రతీ ఒక్కరినీ ఏదో ఓ పేరు, ఓ ముద్ర వేసి కించపరుస్తూనే ఉన్నారు. ఇంతగా మరొకరిపై పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషం, కోపం పెంచుకుంటే అవన్నీ ఆ వ్యక్తినే దహించి వేస్తాయని జగనే స్వయంగా త్వరలో నిరూపించి చూపబోతున్నారు.




