పోలింగ్ రోజున విజ్ఞత ఉన్న చాలామంది క్యూ లో నిలబడి ఓటు వేయడానికి ఆసక్తి చూపించరు. నా ఒక్క ఓటు వేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు తలక్రిందులవుతుందా..? గెలిచే వాడు గెలవకపోతాడా..? ఓడే వాడు ఓటమిని తప్పించుకుంటాడా..? అనే భావనలో ఉంటూ టీవీ లు వీక్షిస్తూ రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు.
ఇటువంటి వారిని చైతన్య పరచడానికే చరిత్ర కొన్నిపాఠాలను తన పేజీలలో భద్ర పరిచింది. ఒక్క ఓటుతో కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చు అని బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నిరూపించబడింది. ఆ ఒక్క ఓటు ఎంత విలువైనదో ఆనాడు బీజేపీ ప్రభుత్వం తో పాటు అన్ని రాజకీయ పార్టీలకు తెలిసొచ్చింది.
ఒక్క ఓటుతో మంచి పై చెడు విజయం సాధిస్తే దాని ఫలితం ఎంత భయానకంగా ఉంటుందో, దాని భారం ఎన్ని తరాలు అనుభవించాలో ఆలోచిస్తే ఒక్క ఓటే గా అనే ఆలోచన కూడా రాదు. ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత. దానిని కొలవాడనికి, కొనుగోలు చేయడానికి రంగుల కాగితాలు సరిపోవు. కొన్ని జీవితాల భవిష్యత్తు అనేది సృహలో ఉంచుకుని ఓటేస్తే అది ఒక రాష్ట్ర దిశా దశను నిర్దేశించగలదు.
చెడ్డవారి ఆవేశం కన్నా మంచివాడి మోనం సమాజానికి ఎంత చేటు చేస్తుందో అలాగే ఓటు విలువ ఉండి కూడా ఉపయోగించుకోలేని ఓటర్లు కూడా సమాజానికి చేటు చేసినట్టే. కొంతమంది చదువుకున్న అజ్ఞానులు నోటా కు ఓటేసి తామేదో దేశ సేవ చేసాం అనే గర్వంతో ఉంటారు.
నోటాకు ఓటు వేయడం వలన వారు సాధించిన మంచేమిటో, సమాజానికి చేసిన మేలేమిటో, రాష్ట్రానికి కలిగిన లాభమేమిటో చెప్పగలరా..? దాని ఫలితంగా తమ వంతుగా మంచి ఆలోచనతో సమాజానికి ఎదో మంచి చేద్దాం అని రాజకీయాలకు వస్తున్న కొంతమంది నిస్వార్థ రాజకీయ నాయకులను కోల్పోతుంది రాష్ట్రం. అటువంటి వారిలో లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ వంటి మేధావులు కూడా బాధితులే.
రాజకీయ పార్టీలకు ఓటు అంటే కొన్ని రంగుల కాగితాలే కావచ్చు, ఓటుని నోటుతో తూకం వేయవచ్చు కానీ అది ప్రజల చేతిలో ఉంటే కొన్ని కోట్ల జీవితాలను ప్రభావితం చేసే ఒక బ్రహ్మాస్త్రం. ఒక్కోసారి పోటీలో నిలబడిన వ్యక్తి మంచివాడైనా అతను నమ్మిన సిద్ధాంత తప్పయినప్పుడు కులం చూసో, మతం చూసో, మా వర్గం వాడనో, మా ప్రాంతానికి చెందిన వాడనో, మా వాడనో ఆయనకు మద్దతు తెలిపితే అది కురుక్షేత్రానికి దారి తీసినట్లే.
అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరి అర్జునికి పోటీగా నిలబడి తలబడ గలిగిన కర్ణుడు వంటి బలశాలి, బుద్ధిశాలి తమ వైపు నిలబడ్డాడనే అహంకారంతో కౌరవ సేన పాండవుల మీద యుద్దానికి సిద్ధమయ్యారు. దీనితో తానూ జీవితాంతం దానాలు చేసి కూడగట్టుకున్న పుణ్యమంతా ఒక స్వార్ధ పరుడి విజయానికి తోడుగా ఉండడంతో ఆయన అస్త్ర సస్త్ర విద్యలన్నీ నిరుపగోయమయ్యి చివరికి ఓటమి కౌగిట తలవాల్చక తప్పలేదు.
అందుకే పోరాటానికి వచ్చే ముందే ఎవరి పక్షాన యుద్దానికి సిద్దమవ్వాలో రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. అలాగే ఎవరికీ అండగా నిలబడాలి అనేది ఓటర్లు నిర్ణయించుకోవాలి. ఓటు ఒక తరం ఆలోచనను ప్రతిబింబిస్తుంది. ఓటు ఒక తరం భవిష్యత్తుని నిర్దేశిస్తోంది. ఓటు ఒక రాష్ట్ర చరిత్రను మార్చగలుగుతుంది. ఓటు ఒక సరికొత్త నాయకత్వాన్ని సృష్టించగలుగుతుంది. ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత – బలం. నోటు కోసం ఓటును అమ్ముకోవద్దు. ఆలోచించండి…ఆచరించండి..!




